న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్ కేసులు కాస్త తగ్గుతున్నా.. మహమ్మారిపై ఇంకా పోరాటం ముగియలేదని కేంద్రం పేర్కొన్నది. సగటున రోజుకు దేశంలో 20వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని, ఇందులో 56శాతం కేరళలోనే ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, మిజోరాం, కర్ణాటకలో 10వేల కంటే ఎక్కువ యాక్టివ్ కేసులున్నాయని చెప్పారు. అరుణాచల్ప్రదేశ్, అసోంలోని కొన్ని జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5-10శాతం మధ్య ఉందని, తొమ్మిది రాష్ట్రాల్లోని 34 జిల్లాల్లో పదిశాతాని కంటే ఎక్కువ వీక్లీ పాజిటివిటీ రేటు నమోదువుతుందన్నారు. లక్షద్వీప్, చండీగఢ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, సిక్కిం తన జనాభాలో కొవిడ్ టీకా మొదటి డోస్ వేసినట్లు లవ్ అగర్వాల్ పేర్కొన్నారు.