పెద్దపల్లి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు. ఈ సంఘటన మంథని మండలం చల్లపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన దంపతులు కొత్త సాంబయ్య, లక్ష్మి దారుణ హత్యకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
మంథని సీఐ సతీష్, ఎస్ఐ చంద్ర కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా, భూ తగాదాల వల్లే హత్యలు జరిగి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దంపతుల హత్య స్థానికంగా సంచలనం సృష్టించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.