హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): దేశ పారిశ్రామిక విధానాలను సమీక్షించుకొని ప్రగతిశీల విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. 35 ఏండ్ల క్రితం చైనా, భారత్ల జీడీపీ సమానంగా ఉండేదని, ఇప్పుడు చైనా ప్రపంచంలోనే పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఆవిర్భవించిందని తెలిపారు. దీనికి కారణాలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని నొక్కిచెప్పారు. దీన్ని తాము చెప్తే రాజకీయ కోణంలో చూస్తున్నారని, సీఐఐ లాంటి పారిశ్రామిక సమాఖ్యలు కేంద్రానికి సూచనలు చేయాలని కోరారు. హైదరాబాద్లోని ఐటీసీ కాకతీయ హోటల్లో బుధవారం సీఐఐ తెలంగాణ శాఖ వార్షిక సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ ‘భారతదేశం 75: క్యాటలైజింగ్ ఛేంజ్ ఫర్ న్యూ ఇండియా’ అనే అంశంపై మాట్లాడారు. ఎంపీలు ఎక్కువున్న రాష్ట్రాలకు మేలు చేస్తూ, తక్కువ సీట్లున్న రాష్ట్రాలను కేంద్రం చిన్న చూపు చూస్తున్నదని విమర్శించారు.
1987లో భారత్, చైనా జీడీపీ దాదాపు సమానంగా ఉండేవని, ఇప్పుడు భారత్ జీడీపీ 2.4 ట్రిలియన్ డాలర్లు ఉండగా, చైనా జీడీపీ 16 ట్రిలియన్ డాలర్లకు చేరిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. చైనాతో పోటీ పడేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక విధానాల్లో మార్పులు చేయాల్సి ఉన్నదని చెప్పారు. ‘చైనాలో వేల ఎకరాల్లో పారిశ్రామిక పార్కులు ఉంటాయి. మనదేశంలో చిన్నచిన్న పారిశ్రామిక పార్కులు ఉన్నాయి. తెలంగాణలో భారీ పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయడానికి మేం ప్రయత్నాలు చేస్తుంటే కేంద్రం సహకరించడంలేదు. ప్రోత్సాహకాలు ఇవ్వటం లేదు. టెక్స్టైల్ రంగంలో ప్రపంచ అవసరాల్లో 35-40 శాతం చైనా ఉత్పత్తి చేస్తున్నది. బంగ్లాదేశ్ 8 శాతం, శ్రీలంక 7 శాతం ఉత్పత్తి చేస్తుంటే, భారత్ మాత్రం 4 శాతం మాత్రమే అందిస్తున్నది. దేశంలో వస్త్ర ఉత్పత్తికి అన్ని రకాల వనరులు అందుబాటులో ఉన్నా వాటిని వినియోగించుకోవడం లేదు. దీని గురించి కచ్చితంగా ఆలోచించుకోవాల్సి ఉన్నది. ఉత్తరప్రదేశ్లో 22 కోట్ల జనాభా ఉన్నా, అక్కడ ఎందుకు వస్త్ర పరిశ్రమ పుంజుకోవడంలేదో ఆలోచించాలి’ అని కేటీఆర్ సూచించారు. ‘కరోనా ప్రారంభ సమయంలో మెడికల్ డివైజెస్ కంపెనీల యజమాన్యాలతో సమావేశమైనప్పుడు దేశీయంగా ఉత్పత్తి చేసిన చేతి గ్లౌజులకంటే చైనావి తక్కువ ధర ఉండటంతో అక్కడినుంచే దిగుమతి చేసుకొంటున్నారనే సమాధానం వచ్చింది. ఇలాంటి పరిస్థితులపై కేంద్రం సమీక్షించుకోవాలి. పారిశ్రామిక సమాఖ్యలైనా కేంద్రానికి సూచించాలి’అని కోరారు.
రక్షణ ఉత్పత్తుల కారిడార్ను హైదరాబాద్ – బెంగళూరు మధ్య ఏర్పాటుచేయాలని కోరితే ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్కు మంజూరు చేశారని మంత్రి కేటీఆర్ తెలిపారు. రక్షణరంగ పరిశ్రమలు, అనుబంధ పరిశ్రమలు, ఎమ్మెస్ఎంఈలన్నీ హైదరాబాద్, బెంగళూరులో ఉంటే బుందేల్ఖండ్లో ఈ కారిడార్ పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. అక్కడ కారిడార్ పెట్టడాన్ని తాము వ్యతిరేకించటంలేదని, కానీ ప్రపంచ స్థాయి పరిశ్రమలు వారికి అనువైన పరిశ్రమ వాతావరణం, అనుబంధ పరిశ్రమలు ఉన్నచోటికే వస్తాయని గుర్తు చేశారు. యూపీలో 80 ఎంపీ స్థానాలుంటే, తెలంగాణలో 17 మాత్రమే ఉన్నాయని కేంద్రం ఆలోచించి ఉండవచ్చని అన్నారు. తెలంగాణ కూడా భారత్లో భాగమేనని గుర్తుంచుకోవాలని సూచించారు. పెట్టుబడుల ఆకర్షణలో హైదరాబాద్ నగరం దేశంలోని ఇతర రాష్ర్టాలతో పోటీపడటంలేదని, ప్రపంచంలోని ప్రముఖ దేశాలతో పోటీ పడుతున్నదని చెప్పారు. హరితహారంలో కృషి చేసిన పలు సంస్థలు, వ్యక్తులకు కేటీఆర్ అవార్డులిచ్చారు.
భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా వాగేశ్ దీక్షిత్, ఉపాధ్యక్షుడిగా సీ శేఖర్ రెడ్డి ఎన్నికయ్యారు. బుధవారం హైదరాబాద్లో జరిగిన సీఐఐ వార్షిక సమావేశంలో నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరిద్దరు సంవత్సరం పాటు పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం సీఐఐ తెలంగాణ శాఖ ఉపాధ్యక్షుడిగా ఉన్న దీక్షిత్కు పదోన్నతి లభించింది.