పోలీస్ స్టేషన్కు వస్తున్న ఫిర్యాదులు.. జరిగిన చోరీలను నిశితంగా పరిశీలించారు.వాటిల్లో పట్టుబడ్డ నిందితులను విచారించినప్పుడు వెలుగులోకి వచ్చిన విషయాలను విశ్లేషించుకున్నారు. ఇలా దాదాపు ఓ 10మంది దొంగల నేర చరిత్రను పరిశీలించారు. అందులో వారు చేసిన చిన్న చిన్న చోరీలు, రోడ్లపై కోట్లాటలు అన్నింటికీ మత్తే ఒక కారణంగా గుర్తించారు. ఈ మత్తుకు అలవాటై చిన్న వయస్సులోనే వీరంతా నేరాలకు అలవాటు పడుతున్నారని గుర్తించారు.అంటే ఈ 10 మందిని మారిస్తే వీరి వల్ల జరుగుతున్న నేరాల సంఖ్య పదుల సంఖ్యలో తగ్గుతాయని పోలీసులు ఆశించారు. అందులో భాగంగానే ఆపరేషన్ ‘ఛేంజ్’ను అమలు చేద్దామని నిర్ణయించుకున్నారు.
సిటీబ్యూరో, నవంబరు 15 నమస్తే తెలంగాణ : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైం విభాగానికి చెందిన సబ్ ఇన్స్పెక్టర్ కిష్టయ్య, హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, కానిస్టేబుల్ విజయ్, ఇక్బాల్, ప్రసాద్ ఈ ‘ఆపరేషన్ ఛేంజ్’ను ప్రారంభించారు. దీంతో దాదాపు ఇప్పుడు జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో దాదాపు 10 మంది నేరస్తుల్లో మార్పు తీసుకొచ్చి వారు ఒక క్రమశిక్షణతో జీవించేలా మార్గాన్ని చూపించారు. ఇలా మారిన ఈ 10 మంది మూడేండ్లుగా సజావుగా బతుకుతున్నారు. ఏ ఒక్క సందర్భంలో కూడా వీరు నేరాల వైపునకు తిరిగి చూడలేదు. కష్టపడి పని చేసుకుంటూ సంతోషంగా ఉంటున్నారు.
పలుమార్లు కౌన్సెలింగ్..
ఆపరేషన్ ఛేంజ్లో భాగంగా పోలీసులు తమ పరువు ప్రతిష్టలు, స్థాయిల జోలికి పోకుండా ప్రయత్నంలో భాగంగా ఇలా నేరాలకు పాల్పడుతున్న వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేద్దామని నిర్ణయించుకున్నారు. దీని కోసం రోడ్లపై కొట్లాటలు, చిన్న చిన్న చోరీల కారణంగా పెరుగుతున్న ఫిర్యాదులు, ఇలా విశ్లేషించుకుని ఆ నేరస్తుల జాబితాను రూపొందించుకున్నారు. వీరంతా జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న లొకేషన్లను తెలుసుకున్నారు. వారి కుటుంబం పరిస్థితిని ఆరా తీశారు. ముందుగా వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. చిన్నప్పటి నుంచి వారి ప్రవర్తన, వారిలో మార్పు వచ్చిన వయస్సు, అలా మారడానికి ప్రధాన కారణాలను తెలుసుకున్నారు. అలా ఈ క్రైం విభాగం వారిని అదుపులోకి తీసుకొన్న సమయంలో వారికి వారు చోరీలకు పాల్పడకుండా ఉంటే వారి జీవితాలు ఎలా బాగుపడతాయో పలు మార్లు కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఒక సారి కాదు రెండు సార్లు కాదు వందసార్లు అయినా కౌన్సెలింగ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇలా ఆ 10 మందికి నచ్చజెప్పడం ప్రయత్నించారు.వీరి ప్రయత్నానికి ఆశగా ఓ 19 ఏండ్ల యువకుడు గంజాయి మత్తుకు అలవాటు పడి చేసిన నేరాల గురించి తెలుసుకున్నాడు. ‘సార్…నేను మారుతానని’ ముందుకు వచ్చాడు. ఎస్ఐ కిష్టయ్య, హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ బృందం అతన్ని ప్రోత్సహించారు. అతను ఏడాదిన్నర క్రితం ఓ మెకానిక్ షాపు పెట్టుకుని హాయిగా ఉన్నాడు. మరో దొంగ పూర్తిగా మారిపోయి సొంతంగా ఓ వ్యాపారాన్ని ప్రారంభించాడు. మూడేండ్లుగా భార్య, పిల్లలతో సంతోషంగా ఉన్నాడు. మరో నేర చరిత్ర కలిగిన వ్యక్తి ఓ దుకాణంలో పని చేస్తూ ఇప్పుడు అందరికీ కావాల్సిన వాడిగా మారిపోయాడు. మరొక్క క్రైం రికార్డు ఉన్న వ్యక్తి ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ సంతోషంగా బతుకుతున్నాడు. ఇలా మొత్తానికి ‘ఆపరేషన్ ఛేంజ్’లో సక్సెస్ కావడంతో ఈ బృందం ఇంకా చాలా మందిని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
కుటుంబ సభ్యులకు భరోసా..
ఇలా మారిన నేర చరిత్ర వ్యక్తుల కుటుంబాలు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులు ఇప్పుడు పోలీసులకు రుణపడి ఉంటామని చెప్పుతున్నారు. దీనికి తోడు పోలీసులు కూడా అప్పడప్పుడు కుటుంబ సభ్యులతో మాట్లాడి మారిన వ్యక్తుల ప్రవర్తన గురించి తెలుసుకుంటున్నారు. ఏదైనా తేడా కనపడితే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. మా ప్రయత్నంలో ఉన్నతాధికారుల సహకారం, మద్దతుతోనే ఇలా దాదాపు 10 మంది నేర చరిత్ర కలిగిన వారిని మార్చామని ఈ బృందం ‘నమస్తే తెలంగాణ’తో తెలిపింది.
మార్పును గమనిస్తూ..
ఆపరేషన్ ఛేంజ్లో భాగంగా జగద్గిరిగుట్ట నేర విభాగం బృందం వారు మార్పు తీసుకొచ్చిన వారి కార్యకలాపాలను నిరంతరం పసిగడుతుంటాయి. మారి కొత్త జీవనంలోకి ప్రవేశించిన ఆ 10 మందిని రోజువారి వ్యవహరాలను తెలుసుకుంటారు. ప్రస్తుతం వారు చేస్తున్న వృత్తికి అందులో వచ్చే ఆదాయానికి సంబంధించి ఓ అంచనా ఉండడంతో వారు అందుకు తగ్గట్టు సౌకర్యాలను పొందుతారు. కాబట్టి ఆ పరిమితిని దాటి విలాసవంత సౌకర్యాలు చేస్తున్నట్లు సమాచారం రాగానే ఈ బృందం అతన్ని ప్రశ్నించడంతో పాటు అందుకు గల ఆదాయం వనరుల మార్గాన్ని కూడా తెలుసుకుంటాయి. దీంతో మారామని చెప్పి నాటకాలు ఆడే పరిస్థితికి పూర్తిగా చెక్ పెట్టారు. ఏ చిన్న అనుమానం వచ్చినా పోలీసులు వెళ్లి వారిని ఆరా తీస్తున్నారు. దీనికి తోడు వారి ఫోన్ నంబర్లు, ఇతర సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోలీసు అధికారులు వారి వద్ద సేకరించి పెట్టుకుంటున్నారు.