హైదరాబాద్, డిసెంబర్ 30(నమస్తేతెలంగాణ):తెల్ల బంగారం జిగేల్మంటున్నది. రాష్ట్రంలో పత్తి ధర కొత్త రికార్డులు సృష్టిస్తున్నది. గురువారం ఖమ్మం మార్కెట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో అత్యధికంగా క్వింటాల్కు రూ.9,100 ధర పలుకగా, వరంగల్లో రూ.8,805 పలికింది. పత్తి ధర ఈ స్థాయిలో పెరగటం ఇదే తొలిసారి అని వ్యాపారులు చెప్తున్నారు.
మద్దతు ధరకంటే రూ.3 వేలు అదనం
దేశవ్యాప్తంగా ఈ ఏడాది పత్తి సాగు విస్తీర్ణం తగ్గడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లో భారీగా డిమాండ్ పెరిగింది. దీంతో అంచనాలకు మించి ధర పలుకుతున్నది. కేంద్రం ఈ ఏడాది పొడవు గింజ రకం పత్తి క్వింటాల్కు రూ.6,025, మధ్యస్థ రకం గింజ పత్తికి రూ.5,726 మద్దతు ధర నిర్ణయించింది. కానీ మార్కెట్లో ఎమ్మెస్పీకంటే ఏకంగా రూ.3 వేలు అధికంగా ధర పలుకుతుండటం విశేషం. సాధారణ రకానికి కూడా 8 వేలపైనే పలుకుతున్నది. గతంలో రంగు మారిందని, తేమ శాతం ఎక్కువగా ఉన్నదని సాకులు చెప్పిన వ్యాపారులు, ఇప్పుడు మార్కెట్కు పత్తి రావడమే సంతోషంగా భావిస్తున్నారు. ఈ ఏడాది పత్తి మార్కెట్లోకి రావటం మొదలైనప్పటి నుంచీ ఎమ్మెస్పీ కంటే అధికంగానే ధర పలుకుతున్నది. కొత్త పత్తి వచ్చిన తొలిరోజే వరంగల్లో క్వింటాల్కు రూ.7,610 పలికింది. రాష్ట్రంలో ఏటా సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసేది. ఈసారి ధర భారీగా ఉండటంతో సీసీఐ కొనుగోలు కేంద్రాలనే ఏర్పాటుచేయలేదు. పత్తికి ఊహించని ధర పలుకుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. మార్కెట్లోకి పత్తి తీసుకురావడమే ఆలస్యం హాట్కేక్లా అమ్ముడుపోతున్నది.
డిమాండ్ను గుర్తించి ప్రోత్సాహం
మార్కెట్లో పత్తికి డిమాండ్ పెరగబోతున్నదని ముందే గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం, పత్తి సాగును ప్రోత్సహించింది. గత వానకాలంలో 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాలని రైతులకు సూచించింది. కానీ వివిధ కారణాలతో ఆశించిన స్థాయిలో సాగు కాలేదు. సాగుకు అప్పుడు వెనుకంజ వేసిన రైతులు ఇప్పుడు ధరను చూసి ఆశ్చర్యపోతున్నారు. ప్రభుత్వం చెప్పినట్టు చేస్తే భారీ ఆదాయం వచ్చేదని అంటున్నారు. కేంద్రం వడ్ల సేకరణపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో వచ్చే వానకాలంలో పత్తిసాగును మరింత ప్రోత్సహించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. కోటి ఎకరాల్లో పత్తి సాగైనా మార్కెటింగ్కు ఇబ్బంది లేదని వ్యాపారులు చెప్తున్నారు.
తగ్గిన సాగు.. పెరిగిన డిమాండ్
గతేడాదితో పోల్చితే ఈ ఏడాది దేశవ్యాప్తంగా పత్తిసాగు విస్తీర్ణం భారీగా తగ్గింది. దీనికితోడు అకాల వర్షాలు, గులాబీ పురుగు పంటను దెబ్బతీశాయి. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి డిమాండ్ భారీగా పెరిగింది. దేశంలో గతేడాది 312.46 లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేయగా, ఈ ఏడాది 292.35 లక్షల ఎకరాలకు తగ్గింది. పత్తిసాగు చేసే ప్రధాన రాష్ర్టాలైన మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణలో సాగు విస్తీర్ణం తగ్గింది. మహారాష్ట్రలో సుమారు ఏడు లక్షల ఎకరాలు తగ్గగా, తెలంగాణలో ఏకంగా 14 లక్షల ఎకరాల్లో తగ్గడం గమనార్హం. సాగు విస్తీర్ణం తగ్గినప్పటికీ పత్తి ఉత్పత్తిలో ప్రపంచంలో మనదేశమే మొదటిస్థానంలో ఉన్నది.