ఖమ్మం కమాన్బజార్, ఫిబ్రవరి 3: కేంద్ర బడ్జెట్ కార్పొరేట్లకు మేలు చేసేలా ఉన్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. శుక్రవారం ఖమ్మంలో నిర్వహించిన పార్టీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ జిమ్మిక్కులు, ఆర్భాటాలు తప్ప కేంద్ర బడ్జెట్లో ఏమీ లేదని దుయ్యబట్టారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక ఒడిదుడుకుల గురించి ఒక్కమాట కూడా ప్రస్తావించలేదని చెప్పారు. నిరుద్యోగం, విద్య, వైద్యం తదితర ముఖ్యమైన వాటిని బడ్జెట్లో పట్టించుకోలేదని ఆరోపించారు. దేశ ఆర్థిక వృద్ధిరేటు 6.5 శాతానికే పరిమితమవుతున్నదని ఆర్థిక సర్వే చెబుతుండటం ఆందోళన కలిగించే విషయమని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి రంగం వృద్ధి 9.9 శాతం నుంచి 1.6 శాతానికి పడిపోయిందని పేర్కొన్నారు. ఆహార సబ్సిడీని 29 శాతం, మధ్యాహ్న భోజన పథకం నిధులు 9.4 శాతం, పౌష్టికాహార పథకాలకు ఏకంగా 38 శాతం నిధులు తగ్గించడం దారుణమని పేర్కొన్నారు. అణగారిన వర్గాలైన దళితులు, గిరిజనులు, మైనార్టీలతోపాటు మహిళల సంక్షేమ పథకాలకు కేటాయింపులు చూసి ఆర్థిక విశ్లేషకులంతా పెదవి విరుస్తున్నారని తెలిపారు.