కరోనా ఇంకా తగ్గలేదు.. దేశంలోని ఏ రాష్ట్రం కూడా కోవిడ్-19పై విజయం సాధించలేదు.. కరోనావైరస్ ఇంకా యాక్టివ్గానే ఉంది.. మనల్ని దెబ్బతీస్తూనే ఉంది.. కరోనాపై పోరులో గెలిచామని భావించిన ప్రతిసారి అది ఎదురుదెబ్బ తీస్తూనే ఉంది.. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిందే… సాక్షాత్తూ కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పిన మాటలివి. దేశంలో కొద్ది రోజుల్లోనే కరోనా కేసులు విపరీతంగా పెరిగాయని.. ఇప్పుడు భారత్ సెకండ్ వేవ్ గుప్పిట్లో ఉందని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ హెచ్చరించారు. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా కోవిడ్ 19 నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కరోనా విజృంభన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తం కావాలని, తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రపంచవ్యాప్తంగా అనేక వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. మనల్ని మనం రక్షించుకోవాలంటే లాంగ్ టైం మాస్కులు వాడాల్సిందేనని వీకే పాల్ తెలిపారు. దేశంలోని కొన్ని జిల్లాల్లో ఇప్పటికి చాలా కేసులు నమోదవుతున్నాయని ఆయన చెప్పారు. దేశంలో వైరస్ ఏ మూల ఉన్నా.. దేశమంతటా విస్తరిస్తుందని హెచ్చరించారు. అందుకే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. కోవిడ్ నిబంధనలు పాటించాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు.
దేశంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న 47 జిల్లాల్లో ఆర్టీ-పీసీఆర్ టెస్ట్లను వేగవంతం చేయాలని వీకే పాల్ అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా 10 జిల్లాల్లో అత్యధిక యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపారు. అందులో 8 జిల్లాలు మహారాష్ట్రలోనే ఉండటం గమనార్హం. వీటిలో 59వేలకు పైగా కేసులతో పుణె మొదటి స్థానంలో ఉండగా.. ముంబై, నాగపూర్, థానే, నాసిక్, ఔరంగాబాద్, బెంగళూరు అర్బన్, నాందేడ్, ఢిల్లీ, అహ్మద్ నగర్ తర్వాత స్థానంలో ఉన్నాయి. మహారాష్ట్రలో పాజిటివిటీ రేటు గత వారం 23 శాతానికి దాటిందని వీకే పాల్ తెలిపారు. ఫిబ్రవరి రెండో వారం నుంచి మహారాష్ట్రలో రోజుకు కనీసం 3వేల కేసులు నమోదు అవుతున్నాయని అన్నారు.
ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరూ టీకా వేసుకునేందుకు అర్హులేనని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. కోవిడ్ టీకా కోసం కోవిన్ యాప్లో ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. యాప్ ద్వారా కాకపోతే వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లేప్పుడు ఆధార్ కార్డుతో పాటు బ్యాంక్ పాస్బుక్ లేదా రేషన్ కార్డు తీసుకువెళ్లాలని అన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి