నగరంలో కరోనా తీవ్రత పెరిగింది. శరవేగంగా మహమ్మారి వ్యాపిస్తున్నది. తీవ్ర అనారోగ్య సమస్యలు లేనప్పటికీ రోజురోజుకు కేసులు సంఖ్య పెరుగుదలతో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. రెండోదశ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని శాఖ పరిధిలో అన్ని విభాగాల డాక్టర్లు, సిబ్బంది సెలవులను రద్దు చేసింది. ఓ వైపు కరోనా బాధితులకు చికిత్స అందిస్తూనే వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసేందుకు చర్యలు ప్రారంభించింది. కరోనా నోడల్ కేంద్రాలైన గాంధీ, టిమ్స్, ఎర్రగడ్డ చాతి దవాఖాన, కింగ్కోఠి, ఫీవర్, నిమ్స్ ఆస్పత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. పాజిటివ్ రేట్ పెరుగుతున్న క్రమంలో నగర వ్యాప్తంగా నిత్యం 40 వేల కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. ఒమిక్రాన్ వేరియెంట్ నిర్ధారణకు గాంధీ, సీసీఎంబీలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు.
సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతుండడంతో గ్రేటర్ పరిధిలోని ప్రభుత్వ దవాఖానల్లో అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలోని అన్ని పీహెచ్సీలు, యూపీహెచ్సీలు, బస్తీ దవాఖానలు, సీహెచ్సీలు తదితర ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షలు, వ్యాక్సినేషన్ తదితర విధులతో సిబ్బంది బిజీగా ఉన్నారు. గాంధీ, టిమ్స్, ఎర్రగడ్డ ఛాతి దవాఖాన, కింగ్కోఠి తదితర కొవిడ్ కేర్ కేంద్రాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన వైద్యాధికారులు ఉస్మానియా, నల్లకుంట ఫీవర్ హాస్పిటల్, నిమ్స్ తదితర దవాఖానల్లోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది.
సిబ్బందికి సెలవులు రద్దు
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి సెలవులను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. కొవిడ్ కేర్ సెంటర్లలో ఇప్పటికే వైద్యసిబ్బంది సెలవులను రద్దు చేశారు. అత్యవసర సెలవులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. వారం పది రోజుల్లో కేసుల సంఖ్య తీవ్రస్థాయికి చేరుకునే అవకాశాలుండడంతో సాధారణ సెలవుల్లో ఉన్న వైద్యులను వెనక్కి రప్పిస్తున్నట్లు తెలిసింది. కొవిడ్ కేర్ సెంటర్లలో ఎలక్టివ్ శస్త్రచికిత్సలను కూడా తగ్గించి, అత్యవసర శస్త్రచికిత్సలను మాత్రం కొనసాగిస్తున్నట్లు సమాచారం.
నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంపు
పాజిటివిటీ పెరుగుతున్న నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య భారీగా పెంచారు. కరోనా పరీక్షా కేంద్రాల సంఖ్యను కూడా పెంచనున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవలే నిర్ధారణ పరీక్షల సంఖ్యను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు లక్షకు పెంచగా గ్రేటర్ పరిధిలో 40వేలకు పెంచారు. ఒక్క హైదరాబాద్ జిల్లా పరిధిలోనే ప్రతిరోజు 20వేలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఒమిక్రాన్ విషయానికి వస్తే ప్రతి రోజు రాండమ్గా సేకరించిన 48 నమూనాలను గాంధీ దవాఖానలో జీనోమ్ సీక్వెన్స్ జరుపుతున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. గాంధీతో పాటు సీసీఎంబీలోనూ ఒమైక్రాన్ నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నారు.