హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): దేశంలోని పలురాష్ట్రలలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కేసులు నమోదవుతుండటంతో మరోసారి కరోనా నియమాలను కఠినతరం చేస్తూ వైద్య, ఆరోగ్యశాఖ చర్యలు తీసుకుంటున్నది. హెల్త్డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్రావు 4వ వేవ్పై పలు సూచనలు జారీచేసిన విషయం తెలిసిందే. ఇందులో ముఖ్యంగా మాస్కులు ధరించడం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీచేయడమే కాకుండా, మాస్కులు ధరించని వారికి వెయ్యిరూపాయలు జరిమానా తప్పదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గ్రేటర్లోని వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు.
ప్రతి ఆరోగ్యకేంద్రంలో కరోనా నియమాలు తప్పనిసరిగా అమలయ్యేలా చర్యలు చేపడుతున్నారు. థర్డ్వేవ్ తరువాత దాదాపు మూడు నెలల పాటు ఈ నియమాల నుంచి కొంత విముక్తి లభించింది. గత వారం పదిరోజులుగా దేశంలో మరోసారి కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ సూచన మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఇక నుంచి నగరంలోని అన్ని ప్రభుత్వ దవాఖానలు, ఇతర ఆరోగ్య కేంద్రాల్లోకి మాస్కులు ధరిస్తేనే అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు పూర్తి అదుపులోనే ఉన్నట్టు ఉన్నత వైద్యాధికారులు తెలిపారు. కేసులు పెరిగినా తట్టుకొనేందుకు వీలుగా దవాఖానల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్టు వెల్లడించారు. ఇతర వ్యాధులతో బాధపడుతూ వచ్చే రోగుల్లో ఎవరికైనా కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే వారికి కరోనా పరీక్షలు జరిపి ఫలితాలు వచ్చేవరకు ఐసోలేషన్లో ఉంచుతారు. ఫలితాల్లో పాజిటివ్ వస్తే వారిని చికిత్స నిమిత్తం గాంధీ లేదా టిమ్స్కు తరలిస్తారు. నెగెటివ్ వచ్చినవారికి అవసరమైన చికిత్సను అదే దవాఖానలో అందిస్తారు.
జాగ్రత్తలు తప్పనిసరి: డాక్టర్ బీ నాగేందర్, సూపరింటెండెంట్, ఉస్మానియా హాస్పిటల్
ఇప్పటికైతే మనదగ్గర కరోనా కేసులు పూర్తి అదుపులోనే ఉన్నాయి. ఆందోళన చెందాల్సిన పనిలేదు. అయితే వైరస్ పూర్తిగా మన మధ్య నుంచి పోలేదనే విషయాన్ని ప్రజలు గమనించాలి. ప్రస్తుతం ఢిల్లీ, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం వస్తున్న కొత్త వేరియంట్ పెద్ద ప్రమాదకరం కాకపోయినా మన జాగ్రతలు మనం పాటించాల్సిందే. వైరస్లను తేలికగా తీసుకోవద్దు. కరోనా జాగ్రతలు ప్రతిఒక్కరు తప్పనిసరిగా పాటించాలి. నియమాలు పాటించకపోతే ప్రమాదం ఎదురుకావచ్చు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించడం, చేతులకు శానిటైజర్ పెట్టుకోవడం మరిచిపోవద్దు.