న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: ఢిల్లీ కేంద్రంగా మరో కరోనా వేవ్ తప్పదా.. రోజువారీ కేసుల్లో పెరుగుదలను గమనిస్తే ఆ అవకాశం ఉందనే అనుమానం కలుగుతున్నది. ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నెల 1న 0.57%గా ఉన్న పాజిటివిటీ రేటు శుక్రవారానికి 3.95 శాతానికి పెరిగింది. కరోనా మొదటి వేవ్తో పోలిస్తే.. లక్షణాలున్నప్పటికీ చాలా తక్కువ మంది కరోనా పరీక్షలు చేయించుకొంటున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నవారు మాత్రమే టెస్టులకు ముందుకు వస్తున్నారు. దీన్ని బట్టి నగరంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగానే ఉండొచ్చని ఆరోగ్యాధికారులు అనుమానిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. అయితే, దవాఖానలో చేరేవారి సంఖ్య తక్కువగా ఉండటం కొంత ఊరటనిస్తున్నది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దవాఖానలు అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ శుక్రవారం సూచించారు. ఢిల్లీ వ్యాప్తంగా అన్ని దవాఖానల్లో ప్రస్తుతం 37వేల కొవిడ్ బెడ్లు, 10వేలకు పైగా ఐసీయూ బెడ్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
నోయిడాలో గడిచిన వారం రోజుల్లో 44మంది బడి పిల్లలు కరోనా బారిన పడ్డారు. దీంతో ఆరోగ్యాధికారులు అప్రమత్తమయ్యారు. జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలున్న పిల్లలు ఎవరైనా ఉంటే వారి వివరాలు ఇవ్వాలని బడులను ఆదేశించారు. ఢిల్లీలో కూడా ఇదే తరహా సూచనలు చేశారు. నోయిడాలో నాలుగు రోజులుగా 100కు పైగా రోజువారీ కేసులు నమోదు అవుతున్నాయి.
ఢిల్లీలో కేసులు
ఏప్రిల్ 11-137
ఏప్రిల్ 12-202
ఏప్రిల్ 13- 299
ఏప్రిల్ 14-325
ఏప్రిల్ 15-366