బీజింగ్/న్యూఢిల్లీ: దాదాపు ఏడాది తర్వాత చైనాలో మళ్లీ కరోనా మరణాలు సంభవించాయి. జిలిన్ ప్రావిన్స్లో శనివారం కొవిడ్తో ఇద్దరు మరణించినట్టు అక్కడి వైద్యాధికారులు ప్రకటించారు. గతేడాది జనవరి తర్వాత చోటుచేసుకున్న ఈ మరణాలతో చైనాలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 4,638కి చేరింది. తాజాగా మరణించిన ఇద్దరు కూడా వృద్ధులేనని, వారి ఇతర అనారోగ్య పరిస్థితుల కారణంగా చనిపోయారని నేషనల్ హెల్త్ మిషన్ అధికారి జియావో యహూయ్ తెలిపారు. వీరిద్దరిలో ఒకరు వ్యాక్సిన్ వేయించుకోలేదని చెప్పారు.
కొవాగ్జిన్కు బూస్టర్గా కొవిషీల్డ్.. యాంటీబాడీలు ఆరు రెట్లు వృద్ధి!
ఒక వ్యక్తి రెండు రకాల కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవచ్చా? అనేది ఇప్పటికీ మీమాంసగానే ఉన్నది. అయితే ఇప్పటికే రెండు డోసుల కొవాగ్జిన్ తీసుకున్న వారికి బూస్టర్(మూడో) డోసుగా కొవిషీల్డ్ ఇస్తే వారిలో ఆరు రెట్లు అధికంగా యాంటీబాడీస్ వృద్ధి చెందుతాయని ప్రాథమిక శాస్త్రీయ ఆధారాలు వెల్లడించాయి. ఇదే సమయంలో రెండు డోసుల కొవిషీల్డ్ తీసుకున్న వారికి బూస్టర్గా కొవాగ్జిన్ ఇస్తే యాంటీబాడీస్ అంతగా పెరగవని, ఆ పెరుగుదల చాలా తక్కువగా ఉంటుందని ది ఇండియన్ ఎక్ప్రెస్ నివేదించింది. వ్యాక్సిన్ మిక్సింగ్ ట్రయల్స్పై తొలి ఫలితాలను తమిళనాడులోని వెల్లూరుకి చెందిన క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ బుధవారం డీసీజీఐకి సమర్పించింది.
నాలుగో వేవ్ అవకాశం తక్కువ!
భారత్లో కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని వైద్య నిపుణులు నొక్కిచెబుతున్నారు. నాలుగో వేవ్ కూడా సంభవించొచ్చని అంచనాలు కూడా ఉన్నాయి. అయితే దీనిపై ప్రముఖ వైరాలజిస్టు డాక్టర్ టీ జాకబ్ జాన్ స్పందిస్తూ.. కొత్త కేసుల పెరుగుదలకు అవకాశాలు తక్కువగా ఉన్నాయని అన్నారు. అయినప్పటికీ జాగ్రత్తగా ఉండాలని, అది జరుగదని కూడా ఎవరూ ఊహించలేరని పేర్కొన్నారు. నాలుగో వేవ్ అంచనా వేసేందుకు శాస్త్రీయ, ఎడిపిమియోలాజికల్ కారణాలు లేవని అన్నారు.