మంచి ఫీచర్లు, కస్టమర్ పాజిటివ్ రివ్యూలు, తక్కువ ధరతో పాటు అమెజాన్ ఛాయిస్ లేబుల్ కూడా ఉండటంతో ధరణి ఇటీవల ఆ సైట్ నుంచి ఓ మొబైల్ను కొనుగోలు చేసింది. అయితే, ఫోన్ కొన్న కొద్దిరోజుల్లోనే తన బ్యాంక్ ఖాతా హ్యాకింగ్కు గురైంది. ఫేస్బుక్, జీమెయిల్ ఖాతాలు ఓపెన్ కావట్లేదు. క్రమంగా ఫోన్ తన నియంత్రణలో లేకుండా పోయింది. ఇలా ఎందుకు జరుగుతుందో ఆమెకు అర్థంకాలేదు. దీంతో సర్వీస్ సెంటర్లో మొబైల్ను రిపేరింగ్కు ఇచ్చింది.
అయితే, ఫోన్ తయారీలో వినియోగించిన టూల్స్ నాసిరకమైనవని, ఇన్బిల్ట్ యాప్స్లో సెక్యూరిటీ ప్రొటెక్షన్ సమర్థవంతంగా లేకపోవడంతో ఫోన్ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్టు సర్వీస్ సెంటర్ నిపుణుడు తెలిపాడు. సదరు ఫోన్ను వాడకపోవడమే మంచిదని సలహా ఇచ్చాడు. ధరణికి ఎదురైన ఈ అనుభవం మరో పది రోజుల్లో వేలాది మందికి ఎదురుకాబోతున్నట్టు బ్రిటన్కు చెందిన వినియోగదారుల పరిరక్షణ సంస్థ ‘విచ్?’ హెచ్చరించింది. ఈ మేరకు ‘హ్యాక్ ఫ్రైడే’ పేరిట ఓ సంచలన నివేదికను వెల్లడించింది. ఆ నేపథ్యంపై ప్రత్యేక కథనం..
అమెజాన్, ఈబే, అలీఎక్స్ప్రెస్
‘బ్లాక్ ఫ్రైడే’ పేరిట ఈ నెల 26న జరుగనున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ సేల్లో మాల్వేర్తో నిండిన కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను అమ్మకానికి పెట్టనున్నారు. వీటిని కొనుగోలు చేస్తే, సైబర్ నేరగాళ్ల చేతికి వ్యక్తిగత సమాచారం చేరిపోయినట్లే. దీనికి సంబంధించిన సమగ్ర వివరాలను ‘విచ్?’ సంస్థ తన పరిశోధన నివేదికలో వెల్లడించింది. దాన్ని ‘హ్యాక్ ఫ్రైడే’గా పిలుస్తున్నారు.
రిటైల్ విక్రయాలను పెంచే ఉద్దేశంతో అమెరికాతో పాటు పలు దేశాల్లో ఏటా నవంబర్ నాలుగో శుక్రవారం ‘బ్లాక్ ఫ్రైడే’ని నిర్వహిస్తున్నారు. ఈ రోజున అత్యంత తక్కువ ధరల్లోనే రిటైల్ వస్తువులను అందుబాటులో ఉంచుతారు. వేల కోట్లల్లో వ్యాపారం జరుగుతుంది. దీంతో ఈ 26న జరుగనున్న ‘బ్లాక్ ఫ్రైడే’ రోజున కొనుగోళ్లు పోటెత్తుతుండటంతో సైబర్ దుండగులు దీన్నో అవకాశంగా మలుచుకున్నట్టు ‘విచ్?’నివేదిక తెలిపింది.