ఐదేండ్లకు సరిపడా ధాన్యం నిల్వలు ఉన్నాయని, తాము గింజ కూడా సేకరించేది లేదని ఎఫ్సీఐ లేఖ రాసింది. రాష్ట్రవ్యాప్తంగా 63 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా వందశాతం పంటల నమోదును శాస్త్రీయంగా చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ. తెలంగాణలో అంత పంట ఎలా పండిందంటూ ఆశ్చర్యం వ్యక్తంచేస్తూ తాము సేకరించలేమంటూ చేతులెత్తేయడం కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానానికి నిదర్శనం. వానకాలంలో 1.35 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని రాష్ట్రం కోరితే 59 లక్షల టన్నులు మాత్రమే సేకరిస్తామని, యాసంగిలో ఒక్క కిలో దొడ్డుబియ్యం కూడా సేకరించేది లేదని కేంద్రం అధికారికంగా లేఖ రాసింది.
–మంత్రి నిరంజన్రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పండే ధాన్యాన్ని కచ్చితంగా సేకరిస్తామని కేంద్ర ప్రభుత్వం నుంచి బీజేపీ రాష్ట్ర నేతలు (గురువారం) సాయంత్రం 5 గంటలకల్లా లేఖ తెప్పిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి సవాలు విసిరారు. గురువారం ఉదయం హైదరాబాద్లోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం నుంచి లేఖ తెప్పించలేకపోతే.. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వారి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో లబ్ధి పొందాలనే థర్డ్ క్లాస్ రాజకీయాల్లో భాగంగా బీజేపీ నేతలు దొంగదీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే.. దొంగదీక్షలు చేయడం మాని.. యాసంగి పంటను సేకరిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చేదాకా ఆమరణ దీక్ష చేయాలని హితవు పలికారు. బండి సంజయ్ సహా బీజేపీ నేతలంతా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, రైతాంగాన్ని మభ్య పెట్టడానికి డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. వ్యవసాయం పట్ల, రైతుల పట్ల కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా లక్షల మంది అన్నదాతలు ఆందోళన చేపట్టినా పట్టించుకోకపోవడంతో సుప్రీంకోర్టు కలుగజేసుకొని ఆ చట్టాలను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చిందని గుర్తుచేశారు.
ధాన్యం సేకరణపై సీఎం కేసీఆర్ రెండుసార్లు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ను కలిసి విజ్ఞప్తిచేసినా.. కేంద్రం నుంచి సరైన స్పందనలేదని మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడించారు. వానకాలం పంట సేకరించాలని రాష్ట్ర ప్రభు త్వం ఉత్తరాలు రాసినా, ప్రతినిధుల బృందం వెళ్లి మొరపెట్టుకొన్నా.. కేంద్రం పెడచెవిన పెట్టిందని తెలిపారు. ఐదేండ్లకు సరిపడా ధాన్యం నిల్వలున్నాయని, తాము గింజ కూడా సేకరించేది లేదని ఎఫ్సీఐ లేఖ రాసిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 63 లక్షల ఎకరాల్లో వరి సాగైందని, దేశంలో ఎక్కడా లేనివిధంగా వందశాతం పంటల నమోదును శాస్త్రీయంగా చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. తెలంగాణలో అంత పంట ఎలా పండిందంటూ ఆశ్చర్యం వ్యక్తంచేస్తూ తాము సేకరించలేమని చేతులెత్తేయడం కేంద్ర వ్యవసాయ వ్యతిరేక విధానానికి నిదర్శనమని తెలిపారు. వ్యవసాయంపై తాము చెప్పే లెక్కలు అవాస్తవమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించుకోవచ్చని సూచించారు. వానకాలంలో 1.35 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని రాష్ట్రం కోరితే 59 లక్షల టన్నులే సేకరిస్తామని, యాసంగిలో కిలో దొడ్డుబియ్యం కూడా సేకరించేదిలేదని కేంద్రం అధికారికంగా లేఖ రాసిందంటూ ఆ లేఖను మీడియాకు చూపించారు.
బీజేపీ నేతలు హుజూరాబాద్లో కాళ్లుపైన పెట్టి తలకింద పెట్టినా గెలిచేది టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాసేనని మంత్రి నిరంజన్రెడ్డి కుండబద్దలు కొట్టారు. హుజూరాబాద్లో ఓడిపోతున్నామని నిర్ధారణకు వచ్చి న బీజేపీ నేతలు చివరి నిమిషంలో రైతులను గందరగోళ పరచాలని దీక్షల నాటకానికి తెరలేపారని అన్నారు. వారి పాచికలు పారవని స్పష్టంచేశారు. బీజేపీ చిల్లర రాజకీయాలను చైతన్యవంతులైన ప్రజలు నమ్మరని చెప్పారు. పదవి, బాధ్యతలిచ్చి పార్టీలో, ప్రభుత్వంలో ఈటలను అందలమెక్కిస్తే, పెంచిపెద్ద చేసిన నాయకుడు, సీఎం కేసీఆర్నే బొందపెడతా అని దిగజారి మా ట్లాడటాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. విద్యార్థి ఉద్యమనాయకుడు, ఆణిముత్యంలాంటి గెల్లు ను కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా నిలిపారని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వమే వానకాలం పంటను కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందవద్దని మంత్రి నిరంజన్రెడ్డి భరోసా ఇచ్చారు. వానకాలంలో పండిన ప్రతి గింజను కొంటామని పేర్కొన్నారు. ఇందుకు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. వివిధ వ్యవసాయ అనుకూల విధానాలతో రైతులను ఆదుకొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని చెప్పారు. దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయరంగానికి రూ.60వేల కోట్లు ఖర్చు చేస్తున్నదని గుర్తుచేశారు. కేంద్రానికి వ్యవసాయంపై చిత్తశుద్ధిలేదని, కార్పొరేట్ శక్తులకు లాభం చేయటమే వారి నినాదం.. విధానమని మండిపడ్డారు.