జోగులాంబ గద్వాల : జిల్లాలోని అయిజ మండల పరిధిలోని చిన్న తాండ్రపాడు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో కొత్తగా నిర్మించిన భవనంలోని విద్యార్థులను కాంట్రాక్టర్ బయటకు పంపించి తాళం వేశారు. ఈ విషయమై కాంట్రాక్టర్ రమేష్ ను ఫోన్ ద్వారా సంప్రదించగా నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నానని తెలిపారు. చిన్న తాండ్రపాడు గ్రామంలో కొత్తగా స్కూల్ భవనం నిర్మించి నాలుగు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు బిల్లులు మంజూరు చేయకుండా అధికారులు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన బిల్లు ఏఈ అజాం బిల్లును ఆపారని పేర్కొన్నారు.
భవనం కోసం తెచ్చిన అమౌంట్ కు వడ్డీలు కట్టలేక నరకయాతన అనుభవిస్తున్నాను. ఏఈ, డీఈలు మాత్రం అప్పుడు వస్తాను ఇప్పుడు వస్తాను అంటూ కాలయాపన చేస్తున్నారు. దానికి సంబంధించిన బిల్లులు ఇస్తేనే తాళం తీస్తానని స్పష్టం చేశారు.