తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి 12 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 72,745 మంది భక్తులు దర్శించుకోగా 24,156 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.48 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.
కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు గురువారం శ్రీ కపిలేశ్వర స్వామివారు సూర్యప్రభ వాహనంపై కటాక్షించారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం శ్రీ స్కోమస్కందమూర్తి, శ్రీకామాక్షి దేవి అమ్మవారికి స్నపన తిరుమంజనం ఘనంగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు.