అహ్మదాబాద్ : గుజరాత్లోని అహ్మదాబాద్ ఘట్లోదియా ప్రాంతంలో కలకలం రేపిన వృద్ధ దంపతుల హత్య కేసు మిస్టరీ వీడింది. నవంబర్ 2న అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉన్న దయానంద్ సంభర్ (90) విజయలక్ష్మి సంభర్ (80)ను దారుణంగా హత్య చేసిన కేసులో జార్ఖండ్కు చెందిన ఇద్దరు నిర్మాణ రంగ కూలీలు ముకుత్ (20), ఎమన్ తోప్నొ (26)ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జార్ఖండ్లోని ఖుంటి జిల్లాకు చెందిన ఇద్దరు కూలీలు సెప్టెంబర్ 10 నుంచి అహ్మదాబాద్లో నిర్మాణ రంగ కూలీలుగా పనిచేస్తున్నారు.
డబ్బు కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీరు దోపిడీకి స్కెచ్ వేశారు. నవంబర్ 2న పరస్మణి సొసైటీకి చేరుకున్న నిందితులు ధంతేరస్ సందడి తక్కువగా ఉన్న బ్లాక్లోకి వచ్చారు. మూడో ఫ్లోర్లోకి ఎంటరైన వీరికి బాధితుల ఫ్లాట్ మెయిన్డోర్ తెరిచిఉండటం గమనించారు. దీంతో నిందితులు ఆ ఫ్లాట్లోకి చొరబడగా దయానంద్ వారిని వారించాడు. దీంతో వృద్ధుడిపై కత్తితో దాడి చేసి చంపారు. ఆపై ఆయన భార్య విజయలక్ష్మినీ కత్తిపోట్లతో కడతేర్చారు. విలువైన వస్తువుల కోసం ఇల్లంతా గాలించారు. ఏమీ దొరకకపోవడంతో అక్కడ కనిపించిన రూ 500 తీసుకుని ఉడాయించారు.