నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించటానికి మోదీ సర్కార్ మరోమారు సమాయత్తమైంది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగం అనంతరం రాజ్యాంగ పీఠికను ఆయనతోపాటు యావత్దేశం పఠించే కార్యక్రమం కూడా ఉంది. స్వతంత్ర భారతావనికి వెలుగు చూపుతున్న దీపస్తంభం లాంటి రాజ్యాంగాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటం హర్షించాల్సిన విషయమే. కానీ, రాజ్యాంగంలో పొందుపరిచిన సమున్నత విలువలు ఏ మేరకు అమలవుతున్నాయి? ఆ విషయంలో దేశానికే దిశానిర్దేశం చేయాల్సిన కేంద్ర ప్రభుత్వ ఆచరణ ఎలా ఉంది? అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. దేశాన్ని సర్వసత్తాక, సమసమాజ, లౌకిక, ప్రజాతంత్ర రిపబ్లిక్గా అభివర్ణించిన రాజ్యాంగం.. దేశపౌరులకు న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వాన్ని వాగ్దానం చేసింది. మోదీ ప్రభుత్వ విధానాలు వీటిని బలోపేతం చేసేవిధంగా ఉన్నాయా?
2014లో మోదీ ప్రధానిగా అధికారం చేపట్టేనాటికి ప్రపంచ దేశాల ప్రజాస్వామ్య సూచీలో భారత్ 7.92 స్కోరుతో 27వ స్థానంలో ఉంది. గతేడాదికి భారత్ స్కోరు 6.61 పాయింట్లకు తగ్గి 53వ స్థానానికి దిగజారింది. ఈ జాబితాను రూపొందించే ‘ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్’.. ‘ప్రస్తుత ప్రభుత్వ హయాంలో భారతదేశ ప్రజాస్వామిక సంప్రదాయాలపై గట్టి ఒత్తిడి పడుతున్నది. పౌరహక్కుల అణచివేత కొనసాగుతున్నది. దీనివల్లే ఈ పరిస్థితి తలెత్తింది’ అని వ్యాఖ్యానించింది. ఈ జాబితాను, దాంట్లో లెక్కించిన తీరును కేంద్ర ప్రభుత్వ పెద్దలు, బీజేపీ నేతలు ఆక్షేపించవచ్చు. కానీ, మోదీ రాకముందు నుంచీ ఎంతోకాలంగా గణాంకాలను విడుదల చేస్తున్న అంతర్జాతీయ సంస్థ అది. అయినా గణాంకాలు వాస్తవాలకు మసిపూయలేవు కదా.
దేశాన్ని ఐక్యంగా నిలిపి ఉంచే సమాఖ్య స్ఫూర్తికే ముప్పు తెచ్చే విధంగా, రాష్ర్టాల హక్కులను కాలరాస్తూ కేంద్రం పెత్తందారీ పోకడలు పోతున్నది. రాష్ర్టాల అధికారాలను, ఉమ్మడి జాబితాలోని అధికారాలను కూడా కేంద్రం గుంజుకుంటున్నది. దేశంలో విస్తృత ప్రజానీకంపై ప్రభావం చూపే వ్యవసాయ చట్టాల వంటి వాటిని కూడా సరైన చర్చ లేకుండా, ప్రతిపక్షాల సూచనలను పరిగణనలోకి తీసుకోకుండా చట్టసభల్లో ఏకపక్షంగా ఆమోదముద్ర వేయించుకుంటున్నది. సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను విచ్చలవిడిగా దుర్వినియోగపరుస్తున్నది. ప్రజాస్వామ్యం అంటేనే భిన్నాభిప్రాయాలను గౌరవించటం. అటువంటిది.. విపక్ష నేతల మీద కేసులు మోపి వారి నోరు మూయించే నియంతృత్వ ధోరణులను అనుసరిస్తున్నది. ప్రధాని నరేంద్ర మోదీకి రాజ్యాంగ దినోత్సవంపై నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఈ పరిస్థితులను మార్చే కృషి జరపాలి. విపక్షాల అభిప్రాయాలను, విమర్శలను గౌరవించాలి. తద్వారానే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. అప్పుడే రాజ్యాంగ దినోత్సవానికి సార్థకత చేకూరుతుంది.