భద్రాచలం, సెప్టెంబర్ 6 : చనిపోతున్నానని చెప్పి సెల్ఫీ వీడియో తీసుకున్న ఓ కానిస్టేబుల్(Constable) గోదావరిలో దూకి ఆత్మహత్యకు(committed suicide) పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కొత్తగూడెం పట్టణానికి చెందిన కానిస్టేబుల్ రమణారెడ్డి(47) క్లూస్ టీం విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. భద్రాచలం బ్రిడ్జి వద్దకు చేరుకున్న ఆయన పైనుంచి దూకి గోదావరిలో(Godavari) ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ విజయలక్ష్మి, ట్రాఫిక్ ఎస్ఐ మధుప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.
సాయంత్రం వరకు గాలింపు చర్యలు ముమ్మరం చేసినా ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అయితే రమణారెడ్డి ఆత్మహత్యకు ముందు ‘నాకు యాక్సిడెంట్ జరగడం వల్ల 15 రోజులుగా నిద్రపట్టడం లేదని, వరదల్లో మా నాన్న కట్టుకున్న ఇల్లు మునిగిపోయిందని, తాను జీవితాన్ని ఇంతకన్నా ముందుకు తీసుకెళ్లలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను’ అని ఒక సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు.