హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై మళ్లీ కుట్రల పర్వం మొదలైంది. సూత్రకారులు వారే, పాత్రధారులే వేరు! గోతులు తీస్తున్నది వారే, గొంతులు మారినాయంతే! తెలంగాణలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు దీన్నే సూచిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. మనవేలితో మన కన్ను పొడిపించే ప్రయత్నం జరుగుతున్నదని, రాష్ట్ర ఆవిర్భావ సమయంలో పడిన ఈ కుట్ర బీజాలు కొత్త రెమ్మలు వేస్తూ కనిపిస్తున్నాయని వారు పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి గందరగోళంలో పడుతుండటంతో అక్కడి నాయకులు మళ్లీ తెలంగాణపై కన్నేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ ఉద్యమకారులు, మేధావుల విశ్లేషణ ప్రకారం.. జరుగుతున్న పరిణామాల తీరు ఇలా ఉన్నది.
తెలంగాణ ఏర్పాటు తర్వాత 63 సీట్లతో టీఆర్ఎస్ గెలిచింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటికీ జరిగినదాన్ని జీర్ణించుకోలేని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు అదే అదనుగా ఢిల్లీ వెళ్లారు. ‘రాష్ట్ర విభజనపై పార్లమెంటులో చర్చ సరిగా జరగలేదు. తలుపులు మూసేసి బిల్లులు ఆమోదించారు. అందువల్ల విభజన బిల్లును రద్దు చేద్దాం. ఈ మేరకు మళ్లీ పార్లమెంటులో చట్టం చేద్దాం’ అని లాబీయింగ్ మొదలుపెట్టారు. ‘బెర్లిన్ గోడలు కూలిపోలేదా? జర్మనీ మళ్లీ ఏకం కాలేదా?’ అని చంద్రబాబు అప్పుడు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. నాడు సెంట్రల్హాల్లో జరిగిన ఈ లాబీయింగ్ తతంగాన్ని చూసి మజ్లిస్ నేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. కేసీఆర్కు సమాచారమిచ్చారు. కేసీఆర్ ఆ తర్వాత మజ్లిస్ మద్దతు కోరడం, రాజకీయ పునరేకీకరణతో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పటిష్ఠపరచడం తెలిసిందే. రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ తన రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి సారించగా, చంద్రబాబు మాత్రం ఇంకా రాజకీయాలు వదల్లేదని 2018 జులై 20న ప్రధాని మోదీ పార్లమెంటులోనే వ్యాఖ్యానించడం, నాడు జరిగిన దానికి పరోక్ష సంకేతం.
విషయం అక్కడితో ఆగలేదు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి, గత (2018) ఎన్నికల్లో జన్మ విరోధి కాంగ్రెస్తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. తన నమ్మినబంటు రేవంత్రెడ్డిని అడ్డుపెట్టుకొని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిర పర్చేందుకు ప్రయత్నించి, ఓటుకు నోటు ఇవ్వజూపి గురుశిష్యులు ఇద్దరూ అడ్డంగా దొరికిపోయి అభాసుపాలయ్యారు. దీంతో అనివార్య పరిస్థితుల్లో చంద్రబాబు తెలంగాణను వదిలిపోక తప్పలేదు. ఒకరిద్దరు మినహా తెలుగుదేశం నేతలంతా చంద్రబాబు వైఖరితో విసుగెత్తి, ఇతర పార్టీల్లోకి తరలిపోయారు. దీంతో తెలుగుదేశం తెలంగాణలో రాజకీయంగా ఉనికి కోల్పోయింది. అయితే.. టీఆర్ఎస్ను, తద్వారా తెలంగాణను దెబ్బతీయడానికి కేంద్రంలోని బీజేపీ సహకారం అవసరమవుతుందన్న ముందుచూపుతో హుజూరాబాద్లో ఈటలపై బలహీన అభ్యర్థిని రేవంత్రెడ్డి నిలిపాడన్న గుసగుసలు కాంగ్రెస్లోనే వినిపించాయి.
తెలంగాణపై పట్టు పోయింది, టీడీపీ పోయింది, ఏపీలో అధికారమూ పోయింది. దీంతో చంద్రబాబు తాజాగా పావులు కదపడం మొదలుపెట్టారు. తెలంగాణలో టీడీపీని పునర్నిర్మించడం అసాధ్యమనే అంచనాకు వచ్చి, తన శిష్యుడు రేవంత్ను కాంగ్రెస్లోకి పంపి, అక్కడి నుంచి ఆపరేట్ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో భాగమే అసలు కాంగ్రెస్వాదులు బ్యాక్ బెంచ్లకు పరిమితమై, క్రమేపీ తెలంగాణ తెలుగుదేశమే, తెలంగాణ కాంగ్రెస్గా అవతరిస్తుండడం. కేసీఆర్ను బలహీన పరిచి, టీఆర్ఎస్ను దెబ్బతీస్తే తప్ప తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేయలేమన్న ఎత్తుగడతో బాబు అండ్ కో.. కొందరు నిత్య అసంతృప్తవాదులను, పదవీకాంక్షలో పడినవారిని బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నది. వారిని కేసీఆర్ మీదికి రెచ్చగొట్టడమే లక్ష్యం. రాజేందర్ భూముల కబ్జా బయటపడగానే, ఆయన్ను ఆదుకునేందుకు రంగంలోకి దిగడం, ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయస్థాయిలో తమకు ప్రత్యర్థిగా నిలిచిన పార్టీ అభ్యర్థికి పరోక్షంగా సహకరించడం, మద్దతివ్వడం ఇందులో భాగమే! ఇద్దరూ కలిసి టీఆర్ఎస్ను వ్యతిరేకించడమూ ఇందులో భాగమే! ఎన్నికల తర్వాత రాజేందర్ మీ పార్టీలో చేరతారా? అని ఒక టీవీ చానల్లో వేసిన ప్రశ్నకు ముసిముసి నవ్వుల ఆమోదమూ అందులో భాగమే! మరో పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ, బాబును తెలంగాణ ఆశాజ్యోతిగా బహిరంగంగా, ఆన్రికార్డు అభివర్ణించడం కూడా అందులో భాగమే! మొన్నటికి మొన్న ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు, విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ, విభజన వల్లే ఆంధ్రా తీవ్రంగా దెబ్బతిన్నదని, హైదరాబాద్ను కోల్పోవడంతో ఎంతో నష్టపోయామనీ వ్యాఖ్యానించారు. ఒకవైపు ఏపీ సర్వ నాశనమవుతుంటే, తెలంగాణ మాత్రం బాగుపడుతున్నదని మరోసారి అక్కసు వెళ్లగక్కారు!
చంద్రబాబు ప్రయత్నాలు అలా సాగుతుంటే, ఇటు మరో సమైక్యవాద పార్టీ వైసీపీ తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టింది. తెలంగాణకు చరిత్రలో ఎన్నడూ లేనంత అన్యాయం చేసిన, ప్రత్యేక రాష్ర్టాన్ని చివరిదాకా అడ్డుకున్న వ్యక్తి వైఎస్ రాజశేఖర్రెడ్డి. ఇప్పుడు ఆయన కూతురు షర్మిల, రాజన్న రాజ్యం తెస్తానంటూ తెలంగాణలో పార్టీ పెట్టారు. షర్మిలకు జగన్కు సరిపడటం లేదనీ, ఆమె పార్టీ పెట్టడం వెనక జగన్ పాత్ర లేనే లేదనీ వైసీపీ నేతలు మొదట్లో నమ్మబలికారు. రంగులేవైతేనేం? రూపమేదైతేనేం? జెండా ఏదైతేనేం? ఎజెండా మాత్రం అదే! ఇప్పుడు షర్మిల వెనక నడుస్తున్నది వైఎస్ అనుచరులే, అనుయాయులే. ఆమె పాదయాత్ర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నది వైసీపీ నాయకులే. జగన్కు అత్యంత నమ్మకస్తుడైన వ్యక్తి వారానికోసారి ఆంధ్రా నుంచి వచ్చి, షర్మిలను కలిసి, వ్యూహాన్ని చర్చించి, సలహాలిచ్చి, సహాయాలు చేసి పోతున్నారు. వైసీపీ ప్రసార సాధనాల్లో షర్మిల పర్యటనలకు విస్తృతకవరేజీ వస్తున్నది. షర్మిల ఎంత సేపూ కేసీఆర్ను విమర్శిస్తారు తప్ప, చంద్రబాబును పల్లెత్తు మాటనరు. వైఎస్ తెలంగాణకు చేసిన అన్యాయం ఊసెత్తరు. జగన్ గురించి, ఆయన ప్రభుత్వం తెలంగాణపై చూపే వివక్ష గురించి మాటే మాట్లాడరు. ఆ సంగతి అట్లా ఉంటే, వైసీపీ నేతలు ఇప్పుడు బహిరంగంగానే బయటపడ్డారు. ఆంధ్రా మంత్రి పేర్ని నాని ఏకంగా తెలంగాణను, ఆంధ్రాను కలిపేద్దామంటూ వింత ప్రతిపాదన చేసి పారేశారు. తెలుగువారికి సమైక్య రాష్ట్రం అవసరమనీ, ఇదే తమ నాయకుడు జగన్ అభిమతమనీ కూడా ఆయన ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పారు. మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా అనడం అల్లాటప్పా కాదు.
ఉపసంహారం… తెలంగాణలో అకస్మాత్తుగా ఎందుకు ఇన్ని పార్టీలు మొలుస్తున్నాయి? వీటి వెనక ఎవరున్నారు? తెలంగాణపై కుట్రల వెనక ఢిల్లీ స్కెచ్ ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రాంతీయ పార్టీల పట్ల బీజేపీ విముఖత బహిరంగ రహస్యమనీ, అందుకే తెలంగాణ ప్రజలను గందరగోళ పరిచే ఎత్తుగడలో భాగంగా అనేకమందిని తెరపైకి తెస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. ‘ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే ఏపీలో అంతర్గత పరిస్థితులేమీ బాగాలేవు. చంద్రబాబుకు రాజకీయంగా ఆశలు అడుగంటుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం ఆర్థికంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. వారి దృష్టి మళ్లీ తెలంగాణపై పడింది. సీమాంధ్ర పార్టీలేవైనా, నేతలెవరైనా, తెలంగాణను, హైదరాబాద్ను బంగారు బాతులా భావిస్తున్నారు. అందుకే ఈ ఎత్తుగడలు. మన తెలంగాణ నాయకులూ కొందరు దీన్ని గుర్తించకుండా వారి వలకు చిక్కుతున్నారు’ అని సీనియర్ రాజకీయ విశ్లేషకుడొకరు అన్నారు. ‘సూత్రధారులు వెళ్లిపోలేదు. కొంచం విరామం తీసుకుని మళ్లీ మొదలు పెట్టారంతే. అయితే ఈసారి మన వాళ్లతోనే తోలుబొమ్మలాట ఆడిస్తున్నారు’ అని తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన నాయకుడొకరు వ్యాఖ్యానించారు. లోపల జరుగుతున్నది ఇదీ! రెండు రాష్ర్టాల రాజకీయాన్ని నిశితంగా గమనిస్తున్న పరిశీలకులకు, రాజకీయ నేతలకు అంతా కళ్లకు కట్టినట్టు కనిపిస్తూనే ఉన్నది. కానీ తెలంగాణ ప్రజలు దీన్ని అర్థం చేసుకోలేరనే భ్రమలో అతి తెలివి నేతలు కొందరు, జనాన్ని తప్పుదోవ పట్టించేందుకు, తెలంగాణపై కేసీఆర్ రాజీ పడుతున్నారని, సమైక్య రాష్ట్ర సీఎం పదవి కోసం తెలంగాణను బలిపెట్టబోతున్నారని పోస్టులు మొదలుపెట్టారు.
టీటీడీపీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటంతో టీఆర్ఎస్కు గట్టి కౌంటర్ ఇవ్వాలని చంద్రబాబు చెప్పారు. మనం మెతకగా ఉండబట్టే చంద్రబాబు పర్యటనను అడ్డుకొంటున్నారు. సీరియస్గా తీసుకుంటే వాళ్లు మన దరిదాపులకు కూడా రారు.
-22.01.2015న మీడియా సమావేశంలో
ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పే అనుభవం ఒక్క చంద్రబాబు నాయుడుకే ఉన్నది.
– 06.03.2018న గాంధీభవన్లో
చంద్రబాబుకు తెలంగాణ అంటే ఎంతో అభిమానం. అందుకే ఉత్పత్తి చేసిన దాంట్లో 54% విద్యుత్తు తెలంగాణకే ఇస్తున్నారు.
(05-11-2014న మీడియా సమావేశంలో రేవంత్)
అది కరడుగట్టిన సమైక్య పాలకులు అధికారంలో ఉన్నకాలం. తెలంగాణ భావజాలం ఉధృతంగా ఉన్నప్పటికీ, అనేక కారణాల వల్ల టీఆర్ఎస్ రాజకీయంగా ఒడిదుడుకుల్లో ఉన్న సమయం. సమైక్యవాదులు పార్టీలకు అతీతంగా, టీఆర్ఎస్ ముఖ్యులకు ఒక వర్తమానం పంపారు. “తెలంగాణ నినాదం, ఉద్యమ జెండా వదిలేయండి, మీరు ఏ పదవులు కోరుకుంటే అవి ఇస్తాం” ఇదీ ప్రతిపాదన! కేసీఆర్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, నిర్దంద్వంగా ఆ ప్రతిపాదనను
తిరస్కరించారు. ఎత్తిన జెండా దించే సమస్యే లేదని, తెలంగాణ రాష్ట్రం తప్ప తమకు ఏ పదవీ అక్కర్లేదనీ తేల్చి చెప్పారు. ఇది
జరిగిన కొన్నాళ్లకు, కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నారు. కరడుగట్టిన సమైక్యవాదుల్లో ఒకరికి అనుంగు సహచరుడైన వ్యక్తి కూడా అదే విమానంలో వెనక కూర్చున్నారు.
కేసీఆర్ను చూడగానే ఆయన సీటు వద్దకు వచ్చి, శిరసు వంచి, రెండు చేతులూ జోడించి, వినమ్రంగా నమస్కారం చేశారు. కేసీఆర్ ఆయనను వారించబోయారు.
అదీ తెలంగాణ పట్ల కేసీఆర్ కమిట్మెంట్. కరడుగట్టిన సమైక్యవాదులు కూడా ఆశ్చర్యపోయేలా, నాటి అంపశయ్య నుంచి నేటి అభివృద్ధి దాకా, తెలంగాణ కోసమే, తన ప్రజల కోసమే, నిలబడ్డ కేసీఆర్ గురించి, కాంగ్రెస్ నేత, చంద్రబాబు చేలా రేవంత్రెడ్డి పెట్టిన పోస్టు చూస్తే ఏమనుకోవాలి? తెలంగాణ కోసం అనేక పదవులు త్యాగం చేసిన కేసీఆర్, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కోసం తెలంగాణను బలి పెట్టబోతున్నారట. కేసీఆర్ ఇప్పటికే రెండుసార్లు ముఖ్యమంత్రి! ఇక ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఏమైనా దేవేంద్ర పదవా… కొత్తగా కోరుకోవడానికి! అయినా కేసీఆర్ తెలంగాణ కమిట్మెంట్ను వేలెత్తి చూపేంత ఉద్యమకారుడా రేవంత్! జనం నమ్ముతారా నమ్మరా అనే ఇంగితం కూడా లేకుండా, నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనుకుంటే ఇలాగే ఉంటుంది!
అప్పుడాయన అన్నమాట… “నా నమస్కారం మీకు కాదు; తెలంగాణ పట్ల మీ నిబద్ధతకు, తెలంగాణ ప్రజల పట్ల మీ చిత్తశుద్ధికి దండం పెట్టకుండా ఉండలేకపోతున్నా” అంటూ వెళ్లిపోయారు!
తెలంగాణ ఏర్పడితే స్వయంగా పాలించుకోవడం చేతకాదని, విద్యుత్తు కష్టాలు తప్పవని, నక్సలైట్లు విజృంభిస్తారని సీమాంధ్ర పాలకులు చెప్పిన మాటలన్నీ అబద్ధాలుగా వాళ్ల అనుభవంలోకి వచ్చాయి. తెలంగాణ వనరులు లేకపోతే ఏపీ మనుగడ అసాధ్యమని అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది. ఏపీ ప్రాదేశికత, అస్థిత్వం, ఉనికి, స్వావలంబన, ఆర్థిక పరిపుష్టి ప్రశ్నార్థకమవడంతో ఆంధ్రా నేతలు తమ మనుగడకోసం కొత్త నినాదాలు ముందుకు తెస్తున్నారు. పార్టీలకు అతీతంగా తెలంగాణ రాజకీయ నాయకత్వం అప్రమత్తమై, తెలంగాణ సార్వభౌమత్వానికి అండగా నిలవాల్సిన సందర్భం ఇది!
-పిట్టల రవీందర్, తెలంగాణ ఉద్యమ నేత
తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీసే కుట్రల వెనుక మళ్లీ జగన్, చంద్రబాబు హస్తం ఉన్నది. తెలంగాణ ఉజ్వల ప్రస్థానాన్ని కొనసాగిస్తూ, దేశానికే ఆదర్శంగా పాలిస్తున్నది. ఇక్కడి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నిండుకుండల్లా కనిపిస్తున్నాయి. దీనిని ఓర్వలేని ఏపీ నేతలు ప్రతిదానికీ విపరీతార్థాలు తీస్తూ, కుట్రలకు పదును పెట్టుకొంటున్నారు. ఆంధ్ర మంత్రి పేర్ని నాని వ్యాఖ్యల వెనుక ఉన్నది జగనేనని తేటతెల్లమైంది. జగన్, చంద్రబాబు, ఈటల వెనక బీజేపీ.. ఈ శక్తులన్నీ మళ్లీ కుట్రలకు తెరతీశాయి. వాటిని తిప్పికొట్టే శక్తియుక్తులు కేసీఆర్కే ఉన్నాయి.
–వీ ప్రకాశ్, తెలంగాణ ఉద్యమ నేత
సమైక్యాంధ్ర పాలన ఉన్నప్పుడు ఎంత సంతోషంగ ఉండేది. ఎంతో గౌరవంగా బతికినం. తెలంగాణ వచ్చిన తరువాత ఏనాడూ సంతోషంగా లేం. సమైక్యాంధ్ర పాలనలో ఉన్నప్పుడు ఈ కులాలు, ఇవ్వన్నీ లేవు. ప్రజలంతా ఒక్కటే కులం.
–ఈటల జమున
మే 30, 2021