హనుమకొండ, మే 7: ‘తిట్ల పురాణానికి ఆది పురుషుడు సీఎం రేవంత్రెడ్డి. కాంగ్రెస్ పాలనలో డిస్ట్రక్షనే కానీ కన్స్ట్రక్షన్ లేదు.. ఒక్క ప్రాజెక్టూ కట్టలేదు. తట్టెడు మట్టి తీయలేదు’ అని మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రా జయ్య విమర్శించారు. గురువారం వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్, రుణ విముక్తి కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లుతో కలిసి హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వరంగల్లో నిర్వహించిన రైతు మేళా అట్టర్ ఫ్లాప్ అయ్యిందని అన్నారు.
సీఎం రేవంత్ రియల్ ఎస్టేట్ అక్రమాలకు పాల్పడుతూ రాహుల్గాంధీకి ఏటీఎంగా మారాడని ఆరోపించారు. తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసిన మహానుభావుడు కేసీఆర్ అని కొనియాడారు. పేదల ఇండ్లు కూల్చుడే తప్ప ప్రాజెక్టులు కట్టడం లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కతున్నదని మాజీ ఎమ్మెల్యేల అరూరి రమేశ్ ఆరోపించారు. ఇచ్చిన హామీల అమలెప్పుడు కేటీఆర్ అడిగితే కాంగ్రెస్ నాయకులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.