రాయపర్తి, ఏప్రిల్ 25: కాంగ్రెస్లో కష్టపడి పనిచేసిన వారికి కాకుండా, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలానికి చెందిన పార్టీ కార్యకర్త షాజహాన్ స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశస్వినీరెడ్డిని నిలదీశారు. మోసం చేస్తున్న వారిని పక్కన పెట్టుకుంటున్నారని, మొదటి నుంచి ఉన్న వారిని దూరం పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో గురువారం జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తమ కుటుంబానికి చెందిన రూ.1.20 కోట్ల భూమి పోయిందని, అయినా పార్టీని పట్టుకుని ఉంటున్నామని, అయినా గుర్తింపు ఇవ్వడం లేదని షాజహాన్ ఆవేదన వ్యక్తం చేశారు.
మోసం చేసి భూమి కొన్న వ్యక్తికి పార్టీలో ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్వీకుల నుంచి వచ్చిన తమ భూమిని మోసం చేసిన వారిని దూరం పెట్టాలని వేడుకొన్నారు. కొత్తగా పార్టీలో చేరిన వనజారాణికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రశ్నించారు. మొదటి నుంచి ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీరెడ్డి చెప్పిన మాటలకు ఇప్పుడు జరుగుతున్న వాటికి పొంతన లేదని షాజహాన్ ఎమ్మెల్యేపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యకర్త నిలదీయడంతో ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి తెల్లమొహం వేశారు.