– కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల తీరుపై మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఫైర్
నల్లగొండ, సెప్టెంబర్ 18 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను నెరవేర్చలేక తీవ్ర ఫ్రస్ట్రేషన్లో ఉందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రస్థాయిలో విమర్శించారు. శుక్రవారం నకిరేకల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రెండు టర్మ్లు ఓడిపోయినా సరిపోయేంత డబ్బును ఈ కొద్ది నెలల్లోనే సంపాదించామని బహిరంగంగా చెప్పుకుంటున్నారన్నారు. కేసీఆర్ పాలనలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిందని, ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలనపై ఎలాంటి గ్రిప్ లేదని, పాలనను గాడిలో పెట్టకుండా కేసీఆర్, ఆయన కుటుంబంపై రాజకీయ విమర్శలకు ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు.
ఏమ్మార్పీ ప్రాజెక్టు ద్వారా నల్లగొండ జిల్లాకు రావాల్సిన నీటిని అందించకుండా ఎడమ కాల్వ ద్వారా ఖమ్మం జిల్లాకు తరలిస్తున్నారని లింగయ్య ఆరోపించారు. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల ఆదేశాలకు నల్లగొండ జిల్లా ఇరిగేషన్ మంత్రి తల ఊపుతూ జిల్లాకు అన్యాయం చేస్తున్నారన్నారు. మరోవైపు పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రాకు నీటిని తరలిస్తున్నా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టించుకోవడం లేదన్నారు. మరో 10–15 రోజుల్లో పంట చేతికి వచ్చే సమయంలో సాగునీరు అందక పొలాలు ఎండిపోతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు.
కాంగ్రెస్ పాలనలో దళితులపై వేధింపులు పెరిగాయన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో వినాయక చవితి వేడుకల వద్ద కూడా రాజకీయాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పలగూడెంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, వార్డు మెంబర్లు సొంత డబ్బులతో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి షెడ్డు నిర్మిస్తే, ఎమ్మెల్యే అనుచరులు దాన్ని తొలగించినట్లు చెప్పారు. దీనిని ప్రశ్నించిన దళితులు, బీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేసి, తలుపులు బద్దలుగొట్టి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఎమ్మెల్యేల మెప్పు కోసం కాకుండా చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా పని చేయాలని చిరుమర్తి లింగయ్య హితవు పలికారు.