ఖానాపూర్ టౌన్ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మండలానికి చెందిన 15 మంది కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే రేఖానాయక్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఖానాపూర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు శేక్ షకీల్తో పాటు పలువురు నాయకులకు ఎమ్మెల్యే టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ నిరుపేదల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారని అన్నారు. పట్టణాలతో పాటు తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి అభివృద్ధి చేశారని వివరించారు.
కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలతో పాటు గ్రామాల్లో కనీస వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు ఉచితంగా 24 గంటల కరెంటు, గ్రామాలకు, తండాలకు బీటీ, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు తదితర అనేక అభివృద్ధి పనులు జరిగాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పుప్పాల శంకర్, వైస్ చైర్మన్ గొరె గంగాధర్, మండల అధ్యక్షుడు రాజగంగన్న, నాయకులు కొక్కుల ప్రదీప్, కౌట మహేశ్, నగేశ్, శ్రావన్, సోయాబ్, రాజు, ప్రకాశ్ పాల్గొన్నారు.