Koppula Eshwar | గోదావరిఖని : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్రతో భయం పుట్టి కుట్ర పూరితంగా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి ఆపించారని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని చౌరస్తాలో శుక్రవారం రాత్రి 8 గంటల తర్వాత కేసీఆర్ చేపట్టనున్న రోడ్ షోకు సంబంధించిన ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో కలిసి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేసీఆర్ బస్సు యాత్రను మాత్రమే ఆపగలుగుతారు. కానీ ప్రజల్లో మీపై ఉన్న వ్యతిరేకతను ఎలా ఆపుతారని కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. బస్సుయాత్రను అడ్డుకోవడం పిరికిపంద చర్యగా అభివర్ణించారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్కు సింగరేణి చరిత్ర గురించి ఏం తెలుసని నిలదీశారు. సినిమాలు చూసి డైలాగులు చెప్పడం కాదని, సింగరేణి కార్మికుల కోసం వారు ఎలాంటి పోరాటాలు చేశారో చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. కార్మికుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన చరిత్ర బీఆర్ఎస్దేనని స్పష్టం చేశారు.
ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే కార్పొరేట్ నాయకులకు ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయని కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. సింగరేణి కార్మికుల కోసం ప్రజా సమస్యలపై కొట్లాడి జైలుకు వెళ్లిన చరిత్ర తనది అని, అధికార దాహం, ధన దాహం కోసం పార్టీలు మారే చరిత్ర వారిదని మండిపడ్డారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి దూకే వివేక్ ఇప్పుడు తన కొడుకును కూడా తన బాటలోకి తీసుకొస్తున్నారని విమర్శించారు. పెద్దపల్లి నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగిన వివేక్ తండ్రి ఇక్కడ ఎందుకు ఫ్యాక్టరీలు పెట్టలేదని నిలదీశారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టే రోడ్డు షోను విజయవంతం చేయాలని ఆయన కోరారు.