న్యూఢిల్లీ: వ్యాక్సిన్ల సరఫరా అరకొరగా ఉండడంతో టీకాల కార్యక్రమం మందకొడిగా సాగడమో లేక మొత్తంగా నిలిచిపోవడమో జరుగుతున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఓ మంచిమాట చెప్పారు. అంతకంతకూ ఎక్కువ కంపెనీలకు టీకా తయారీ లైసెన్స్ ఇవ్వాలని, అలాగే ఆమేరకు రాయల్టీ కూడా చెల్లించాలని వైస్-చాన్స్లర్స్తో జరిగిన వర్చువల్ సమావేశంలో ఆయన సూచించారు. దేశంలో చాలా ల్యాబ్స్ ఉన్నాయని, వాటి సామర్థ్యాన్ని టీకాల తయారీకి ఉపయోగించుకోవాలని గడ్కరీ తెలిపారు. నిజానికి ఈ ప్రతిపాదన పూర్తిగా ఆయని సొంతమేమీ కాదు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ ప్రతిపాదనను కేంద్రానికి ఇదివరకే సమర్పించారు. ఇప్పుడు కేంద్రమంత్రి నోటివెంట అదే సూచన రావడం గమనర్హం. అయితే దీనిపై విపక్ష కాంగ్రెస్ చురకలు వేసింది. కేంద్రమంత్రి గారి మాటలు ఆయన బాస్ వింటున్నారా? అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. “ఏప్రిల్ 18న మజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధాని నరేంద్రమోదీకి రాసిన లేఖలో ఇదే సంగతి ప్రస్తావించారు. కానీ గడ్కరీ బాస్ అది వింటే బాగుండేది” అని రమేశ్ పేర్కొన్నారు. ఈ గడ్కరీ కథకు ఇంకో ట్విస్టు కూడా ఉంది. మంగళవారం జరిగిన వర్చువల్ సమావేశంలో తాను చేసిన వ్యాఖ్యలు ఎక్కడ పైవారికి కోపం తెప్పిస్తాయని అనుకున్నారో ఏమో.. ప్రభుత్వం వివిధ కేంద్రాల్లో టీకాల తయారీకి చేస్తున్న ప్రయత్నాలు నా దృష్టికి ఆలస్యంగా వచ్చాయని ట్విట్టర్లో చిన్న వివరణ ఇచ్చుకున్నారు.