రామాయంపేట, మే 25 : కాంగ్రెస్ నాయకుల ఆగడాలు మితిమీరుతున్నాయి. రోజుకో చోట బీఆర్ఎస్ శ్రేణులపై దాడులకు దిగుతూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. శనివారం మెదక్ జిల్లా రామాయంపేట పట్టణం బీఆర్ఎస్ అధ్యక్షుడు, మున్సిపల్ కౌల్సిలర్ గజవాడ నాగరాజుపై కాంగ్రెస్ నాయకుడు పోచమ్మల గణేశ్ హత్యాయత్నానికి పాల్పడడం సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. నాగరాజుకు, పోచమ్మల గణేశ్కు కొంతకాలంగా భూమి విషయమై గొడవలు జరుగుతున్నాయి. శనివారం పట్టణంలోని ఓ ఆలయం వద్ద పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడుతుండగా అక్కడికి 5 లీటర్ల పెట్రోల్ డబ్బాతో వచ్చిన గణేశ్ నాగరాజుపై దాడికి దిగడంతో పాటు ఒంటిపై పెట్రోల్ పోశాడు. అక్కడే ఉన్న వాళ్లు విషయం గ్రహించి వెంట నే గణేశ్ను పక్కకు తోసేయడంంతో ప్రాణాపాయం నుంచి తప్పింది. బీఆర్ఎస్ శ్రేణులకు విషయం తెలియడంతో ఘటనా స్థలాని కి చేరుకున్నారు. నాగరాజును రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లి ప్రథమ చికిత్స నిర్వహించారు. పరిస్థితి విషమంగా మారడంతో కామారెడ్డిలోని ఓ ప్రైవేటు దవాఖానలో చేర్పించారు. బీఆర్ఎస్ నాయకులు, పోలీస్స్టేషన్లో గణేశ్పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రశ్నించే గొంతుకను ఆపలేరు: హరీశ్
ప్రశ్నించే గొంతుకను కాంగ్రెస్ బెదిరింపులతో నిలువరించలేదని, బీఆర్ఎస్ నాయకుడు గజవాడ నాగరాజుపై కాంగ్రెస్ నాయకుడు పోచమ్మల గణేశ్ దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకుల ఆగడాలు ఇలాగే ఉంటే ప్రతిదాడులు ఉంటాయని హెచ్చరించారు.