హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ) / తిమ్మాపూర్ : ఎప్సెట్ (ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ) పరీక్ష నిర్వహణలో గందరగోళం నెలకొన్నది. తొలిరోజు మంగళవారం అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం పరీక్షకు ఆటంకాలు ఎదురయ్యాయి. వీటన్నింటికీ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. రాష్ట్రంలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకొంటున్నా పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేపట్టలేదు. వర్షం, ఈదురుగాలులను ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలకు సిద్ధం కాలేదు. ఫలితంగా ఎప్సెట్ నిర్వహణలోని పలు పరీక్ష కేంద్రాల్లో విద్యుత్తుకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఆయా కేంద్రాల్లో జనరేటర్, యూపీఎస్ వెలుగుల్లోనే పరీక్షను ఆలస్యంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని వాగేశ్వరీ ఇంజినీరింగ్ కళాశాలలోని అయాన్ డిజిటల్ సెంటర్లో మధ్యాహ్నం రెండో సెషన్ పరీక్ష 55 నిమిషాల పాటు ఆలస్యంగా జరిగింది.
వర్షం రాకతో పరీక్ష కేంద్రంలో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఆ తర్వాత జనరేటర్ ఏర్పాటు చేసినా పక్కనే పిడుగు పడటంతో సిస్టమ్స్ హ్యాంగ్ అయి పరీక్షకు అంతరాయం కలిగింది. పరీక్ష ఆగిపోయిందని విద్యార్థుల తల్లిదండ్రులు భావించి కాలేజీ వద్ద రోడ్డుపై ధర్నా చేశారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడిన సెంటర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరీక్ష 6గంటలకు తిరిగి ప్రారంభించామని, ఆగిపోయిన సమయానికి అదనపు సమయం ఇచ్చి రాయిస్తున్నామని సెంటర్ సూపరింటెండెంట్ శ్రీధర్రెడ్డి తల్లిదండ్రులకు చెప్పినా వినకుండా దాదాపు గంట సేపు రోడ్డుపై భీష్మించారు.
రాత్రి 8 గంటల సమయంలో విద్యార్థులు పరీక్ష రాసి బయటకి రావడంతో ఉత్కంఠకు తెరపడింది. అదేవిధంగా, వరంగల్ జిల్లాలోని మరో పరీక్ష కేంద్రంలో విద్యుత్తు అంతరాయం తలెత్తగా, 15 నిమిషాలు పరీక్షకు అంతరాయం ఏర్పడింది. నల్లగొండలోని మరో పరీక్షాకేంద్రంలో ఉదయం పూట 15 నిమిషాల పాటు పరీక్ష ఆలస్యంగా పూర్తయింది. ఆయా పరీక్షాకేంద్రాల్లో విద్యార్థులకు నష్టం కలగకుండా పరీక్ష నిలిచిన సమయం నుంచి తిరిగి పరీక్షలను కొనసాగించారు. అంతరాయం తలెత్తిన సమయానికి తగినట్టుగా అదనపు సమయాన్ని కేటాయించడంతో విద్యార్థులు ఊపిరిపీల్చుకున్నారు.
ఎప్సెట్ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు 90శాతానికి పైగా విద్యార్థులు పరీక్ష రాశారు. తెలంగాణ, ఏపీ రెండు రాష్ర్టాల్లో పరీక్షకు ఉదయం సెషన్లో 33,500 మందికి 30,288 (90.41శాతం), మధ్యాహ్నం సెషన్లో 33,505 మందికి 30,571 (91.24శాతం) విద్యార్థులు హాజరయ్యారు.