హైదరాబాద్ : తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం ప్రభుత్వం కొనాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు.వరి ధాన్యాన్ని కొనడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరాకరిస్తున్నందుకు నిరసనగా సీఎం కేసీఆర్ ఆదేశానుసారం శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో టీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన ధర్నాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు, రైతులకు పిలుపునిచ్చారు.
కొవిడ్, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నిబంధనల మేరకు, ఆయా జిల్లాల కలెక్టర్ల అనుమతి తీసుకుని నిర్వహించాలని సూచించారు. కేంద్రం దిగి వచ్చే వరకు ఆందోళనలు కొనసాగించాలని మంత్రి కోరారు.
శుక్రవారం రోజు ఉదయం పదిగంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ రైతులతో కలిసి ఆయా ప్రాంతాల్లో రైతు ధర్నాలు చేయాలని శ్రేణులకు, రైతులకు మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు.
14 ఏండ్ల సుదీర్ఘ పోరాటంతో కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ తెర్లు కాకుండా సీఎం కేసీఆర్ ఎంతో ఇష్టంగా బాగు చేస్తూ..బంగారు తెలంగాణ చేస్తున్నారని ప్రశంసించారు.
సమృద్ధిగా సాగు నీరు, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల పాటు నిరాటంకంగా నాణ్యమైన విద్యుత్..చివరకు కొవిడ్ నేపథ్యంలో పంటల కొనుగోలు దాకా… రైతు అనుకూల విధానాలతో ప్రభుత్వం రైతు బంధుగా పని చేస్తున్నదని చెప్పారు.
ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయబోమని అత్యంత దారుణంగా.. నిరంకుశంగా ప్రవర్తిస్తున్నదని మండిపడ్డారు. ఈ నిరంకుశ విధానాల్ని ఎండగడుతూ కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేదాక నిరసనలు కొనసాగుతాయన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఓకరకంగా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరో రకంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారని, రాష్ట్రం ఏం చెబుతుందో కిషన్ రెడ్డి చెబుతుంటే బండి సంజయ్ తప్పుపడుతున్నారు. ఈ గందరగోళం తొలగించి ప్రజలకు, రైతులకు నిజాల్ని స్పష్టంగా తెలియజేయాలనే రైతు ధర్నాలు నిర్వహిస్తున్నామన్నారు.
తెలంగాణ నేతలకు తెలంగాణ రైతాంగం పట్ల చిత్తశుద్ధి ఉంటే, బీజేపీ నేతలు సైతం రైతాంగానికి మేలు చేసే విధంగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇంటి ముందు దర్నా చేయాలన్నారు. రైతులంతా సంఘటితమై పోరాటం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు.