హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాజీపడదని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చెప్పారు. గ్యాంబ్లింగ్, మట్కాను రాష్ట్రం నుంచి తరిమి వేసినట్టు పేర్కొన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటులో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) ప్రశంసించిందని అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించేందుకు తీసుకొంటున్న చర్యలను వివరించారు. వరంగల్ జిల్లా మామునూరులో సెంట్రల్ జైలు ఏర్పాటుకు ప్రభుత్వం 100 ఎకరాల స్థలం కేటాయించిందని, త్వరలో నిర్మాణ పనులు మొదలుపెడతామని వెల్లడించారు. జైళ్ల ఆధునీకరణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని చెప్పారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో అగ్నిమాపక కేంద్రం ఉండాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ స్వప్నమని పేర్కొన్నారు. పోలీసుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. నేర పరిశోధనలో రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన కమాండ్ కంట్రోల్ దేశానికే మార్గనిర్దేశం చేస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తంచేశారు.