హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వరిసాగుమీద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటనలు, దరిమిలా.. ఆయన తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంటున్నది. బీజేపీకి, టీఆర్ఎస్కి యుద్ధం తీవ్రమైందన్న సంకేతాలు అందడంతో.. ‘గతంలో మేము బండి సంజయ్ బాధితుల’మంటూ అనేకమంది ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
బండి సంజయ్ వల్ల తాము దెబ్బ తిన్నామంటూ కొందరు, ఇబ్బంది పడ్డామంటూ మరికొందరు వివిధ మార్గాల ద్వారా అధికార వర్గాలకు గోడు వెల్లబోసుకుంటున్నట్టు అవి వెల్లడించాయి. తమకు న్యాయం చేయాల్సిందిగా బాధితులు కొన్ని ఆధారాలతో సహా వినతి పత్రాలు పంపుతున్నట్టు అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఇవన్నీ చూసి బండి వ్యవహారం ఇంతలా ఉందా.. అని విస్తుపోతున్న ఉన్నతాధికారులు ఆరోపణల నిగ్గుతేల్చి వాస్తవాలేమిటో తెలుసుకోవాల్సిందిగా ఆయా ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు ఫార్వర్డ్ చేస్తున్నట్టు సమాచారం.
బండి సంజయ్ కరీంనగర్ కార్పొరేటర్గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. కరీంనగర్లో కార్పొరేటర్గా ఉన్నప్పుడు పారిశుద్ధ్య కార్మికుల కాంట్రాక్టర్ల నుంచి పెద్ద ఎత్తున ముడుపులు అందుకొన్నారని విమర్శలున్నాయి. అది బయటపడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలంటూ తానే హైకోర్టులో పిటిషన్ వేసి డ్రామా ఆడారని అప్పటి డిప్యూటీ మేయర్ రమేశ్ విమర్శిస్తున్నారు.
దమ్ముంటే డబ్బు తీసుకోలేదని చైతన్యపురిలో తాను కట్టించిన మహాశక్తి దేవాలయంలో సంజయ్ ప్రమాణం చేయాలని రమేశ్ అప్పట్లోనే సవాలు విసిరారు. దానికి సంజయ్ స్పందించలేదని కరీంనగర్ రాజకీయ వర్గాలు చెప్తుంటాయి. అలాగే గ్రానైట్ వ్యాపారులు సెస్ ఎగ్గొడుతున్నారంటూ సంజయ్ తానే ఫిర్యాదు చేశారు. ఆ తరువాత దానిపై మాట మాట్లాడకుండా మిన్నకుండటం వెనుక మతలబు వేరే ఉన్నదన్న గుసగుసలు అప్పుడే వినిపించాయి.
కరీంనగర్ స్మార్ట్ సిటీ టెండర్లలో అన్యాయం జరిగిందంటూ కేంద్ర పట్టణాభివృద్ధిశాఖకు లేఖ రాసిన బండి.. ఆ మర్నాటి నుంచి దాని ఊసే ఎత్తలేదని.. దీని వెనుక కారణాలు ఏమిటనే విమర్శలు వచ్చాయి. బండి సంజయ్ రూ.600 కోట్లకు పైగా ఆస్తులు వెనుకేసుకొన్నారని.. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఇవేకాకుండా సంజయ్కి సంబంధించిన అనేక వ్యవహారాలపై తాజాగా ఫిర్యాదులు అందుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. బండి వ్యవహారశైలితో దెబ్బతిన్న పలువురు తమకు జరిగిన అన్యాయం గురించి వివిధ మార్గాల ద్వారా అధికారులను సంప్రదిస్తున్నారని తమకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
రైతుల విషయంలో బండి సంజయ్ తీరుపై పలు ఆక్షేపణలు వ్యక్తంకావడం, ముఖ్యమంత్రి కూడా ఆగ్రహంగా స్పందించడంతో ఇదే అదనుగా పలు వర్గాల బాధితులు కూడా న్యాయం కోసం అధికారులను సంప్రదిస్తున్నట్టు సమాచారం. బండిసంజయ్పై అందుతున్న ఈ ఫిర్యాదుల్లోని నిజానిజాలను తేల్చడానికి సంబంధిత అధికారులకు, శాఖలకు ఉన్నతాధికారులు పంపిస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.