దుండిగల్, నవంబర్ 12 : తనను గెలిపించిన మూడు వారాల్లోపు నిజామాబాద్కు పసుపుబోర్డు ఏర్పాటు చేయిస్తానని రైతులకు మాట ఇచ్చి.. ఏండ్లు గడుస్తున్నా పసుపుబోర్డు తేకుండా మోసం చేసి తిరుగుతున్న ఎంపీ ధర్మపురి అరవింద్పై చీటింగ్ కేసు నమోదు చేయాలని దుండిగల్ మున్సిపాలిటీకి చెందిన పలువురు టీఆర్ఎస్ నేతలు శుక్రవారం దుండిగల్ పోలీస్స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదుచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన అరవింద్ తప్పుడు వాగ్ధానాలతో పసుపు రైతులను మభ్యపెట్టి మోసగించాడన్నారు. ప్రతిరైతుకు బాండ్పేపర్లు సైతం రాసిచ్చాడన్నారు. ఎన్నికల అనంతరం రైతుల ఊసే ఎత్తని ధర్మపురి అరవింద్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిలో మేడ్చల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగరాజుయాదవ్, బౌరంపేట పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్రెడ్డి, వైస్చైర్మన్ నల్తూరి క్రిష్ణ, దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్ ఎన్.శ్రీనివాస్ రెడ్డి, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్రెడ్డి, దుండిగల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ కమిటీ అధ్యక్షుడు మద్దికుంట సంజీవరెడ్డి, రాష్ట్ర కార్మిక విభాగం నాయకులు ఎత్తరి మారయ్య ఉన్నారు.