నల్లగొండ, మార్చి 4 : డిండి బ్యాలెన్సింగ్, పెండ్లి పాకల రిజర్వాయర్కు సంబంధించిన నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారం వెంటనే చెల్లించాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్తో కలిసి ఏఎమ్మార్పీ ప్రాజెక్టులో భాగంగా డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పెండ్లి పాకల రిజర్వాయర్ భూ సేకరణ, ఆర్ అండ్ ఆర్ పనులపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా పెండ్లి పాకల రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా ముంపునకు గురవుతున్న కొండమల్లేపల్లి మండలం పెండ్లిపాకల, గుడితండా, హర్యాతండా, గాజీనగర్, కర్బొరీ తండా, పాత్యాతండా నిర్వాసితులు డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో భాగంగా ముంపునకు గురవుతున్న నక్కలగండి గ్రామ నిర్వాసితులు తమ సమస్యను వివరించారు. పెండ్లి పాకల రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా నాలుగు తండాల్లో ముంపునకు గురవుతున్న 711 నిర్మాణాలు, 2,053 కుటుంబాలు ఉన్నాయని సర్వేలో గుర్తించినట్లు వివిధ శాఖల అధికారులు కలెక్టర్కు వివరించారు. భూ సేకరణ పరిహారంతో పాటు ఆర్ అండ్ ఆర్ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచనలు చేశారు. సమావేశంలో దేవరకొండ ఆర్డీఓ గోపీరాంనాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జగన్నాథరావు, సూపరింటెండెంట్ రాజశేఖర్ పాల్గొన్నారు.
నల్లగొండ రూరల్ : నల్లగొండ పట్టణంలోని ఇండోర్ స్టేడియాన్ని అంతర్జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ స్టేడియంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియాన్ని ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ఆయన పరిశీలించి మాట్లాడారు. పుల్లెంల గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ తరహాలో అభివృద్ధి చేసేందుకు పట్టణ ప్రగతి నిధుల నుంచి రూ.50 లక్షలు కేటాయించి 50 రోజుల్లో నిర్మాణాలు పూర్తి చేస్తామని తెలిపారు. అదే విధంగా ఇండోర్ స్టేడియం పక్కనే ఉన్నా స్విమ్మింగ్ ఫూల్ను పది రోజుల్లో అందుబాటులోకి తేవాలని అధికారులకు సూచి ంచారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ పూర్వ చౌహాన్, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కమిషనర్ రమణాచారి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్గౌడ్, స్పోర్ట్స్ అథారిటీ అధికారులు పాల్గొన్నారు.
నీలగిరి: నల్లగొండ సుందరీకరణలో భాగంగా చేపట్టిన రహదారి విస్తరణ పనులకు ప్రజలంతా సహకరించాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్ కోరారు. పట్టణంలో చేపట్టిన రహదారి విస్తరణ పనుల్లో భాగంగా 100 ఫీట్ల రోడ్డుకు లోపలకు వస్తున్న భవనాలను మున్సిపాలిటీ అధికారులు తొలగింపు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మర్రిగూడ జంక్షన్ నుంచి క్లాక్టవర్ వరకు 100 ఫీట్ల రోడ్డుకు 144 భవనాలు ఉన్నట్లు గుర్తించామని వాటన్నింటినీ తొలగిస్తున్నట్లు తెలి పారు. రెండు జేసీబీలతో ఎల్వీ కుమార్ పెట్రోల్ బంకు వరకు 80 భవనాలను శుక్రవారం తొలగి ంచారు. శనివారం ఎల్వీ కుమార్ పెట్రోల్ బంకు నుంచి క్లాక్ టవర్కు మిగిలిన భవనాలను తొలగిం చనున్నట్లు తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కేవీ రమణాచారి, టీపీఓ నాగిరెడ్డి, శివ ఇన్చార్జిమేనేజర్ మహ్మద్ రఫీ ఉన్నారు.