భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 3 (నమస్తే తెలంగాణ) : భద్రాద్రి జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారిక వేదిక సిద్ధమవుతోంది. రూ.90 కోట్లతో చేపట్టిన నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం అన్ని హంగులతో ముస్తాబవుతోంది. ఈ నెల 31 నాటికి పూర్తి చేయడానికి కలెక్టర్ అనుదీప్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. నాడు ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవాలంటే ఏ కార్యాలయం ఎక్కడుందో తెలియని పరిస్థితి. ఆఫీసు పనిమీద పట్నం వస్తే అర్జీలు ఇవ్వడానికి కార్యాలయాలు వెతుక్కునే దుస్థితి. ఏ కార్యాలయానికి వెళ్లాలన్నా ఆటో చార్జీలే అధికంగా అయ్యేవి. అధికారులు కూడా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాలంటే ఇబ్బంది పడేవారు. వీటన్నింటికీ సీఎం కేసీఆర్ పరిష్కారం చూపారు. అన్ని శాఖలూ ఒకే దగ్గర ఉండాలని, ఎవరు అర్జీ ఇవ్వాలన్నా అందరు అధికారులూ అక్కడే అందుబాటులో ఉండాలని, అప్పుడే అధికారులకు ప్రజలు తమ సమస్యలు చెప్పుకునే వీలుంటుందని సీఎం కేసీఆర్ సంకల్పించారు. సమీకృత కలెక్టరేట్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. భద్రాద్రి జిల్లాలో దాదాపు 50 శాఖల అధికారులు విధులు చేస్తున్నారు. వీరందరినీ ఒకే దగ్గరకు చేర్చే బృహత్తర కార్యక్రమంలో భాగంగా నూతన కలెక్టరేట్ సిద్ధమవుతోంది. భద్రాద్రి జిల్లాలో కొత్తగూడెం – పాల్వంచ పట్టణాల మధ్య సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో సమీకృత కలెక్టరేట్ భవన సమాదాయం ముస్తాబవుతోంది. దీంతోపాటు రెసిడెన్సియల్ క్వార్టర్స్ నిర్మాణ పనులు కూడా పూర్తి దశకు చేరుకున్నాయి. భద్రాద్రి కలెక్టరేట్ భవనం సకల హంగులతో సిద్ధమవుతోంది. 25 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక వసతులతో నిర్మిస్తున్న సమీకృత భవనంలో కలెక్టర్, అదనపు కలెక్టర్, డీఆర్వో స్థాయి అధికారుల కార్యాలయాలతోపాటు అన్ని శాఖలు ఒకే చోట కొలువుదీరనున్నాయి. ఇప్పటికే 95 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ నెల ఆఖరు నాటికి మిగతా పనులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు. కలర్స్, కోటింగ్, ఫ్లోరింగ్ పెయింటింగ్, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, ప్లంబింగ్ పనులు చేస్తున్నారు. నూతన కలెక్టరేట్ అందుబాటులోకి వస్తే ప్రజలకు పాలన మరింత చేరువవడంతోపాటు పథకాల అమలులో పారదర్శకత పెరగనుంది.
25 ఎకరాల్లో నిర్మిస్తున్న భద్రాద్రి సమీకృత కలెక్టరేట్ భవనంలో అన్ని శాఖలు ఒకే చోట ఏర్పాటు చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో కలెక్టర్, అదనపు కలెక్టర్, డీఆర్వో కార్యాలయాలు ఏర్పాటు చేశారు. మొదటి అంతస్తులో వివిధ శాఖలకు చెందిన కార్యాలయాల కోసం గదులను కేటాయించారు. సమావేశ మందిరాలు, వీడియో కాన్ఫరెన్స్ గది, లిఫ్టులు, మీటింగ్ హాల్, గార్డెన్ ఏర్పాటు చేస్తున్నారు. ముందు భాగంలో పూలమొక్కలతో గార్డెన్ ఏర్పాటు చేసి వాహనాలను నిలిపేందుకు వీలుగా విశాలమైన పార్కింగ్ వసతి కల్పిస్తున్నారు.
కొత్తగా అనేక జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేసిన ప్రభు త్వం.. పాలనను ప్రజలకు మరింత చేరువ చేసిన సంగతి తెలిసిందే. అలాగే కొన్ని కొత్త జిల్లాల్లోనూ కొత్త కలెక్టరేట్ సముదాయాల నిర్మాణాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెంలోనూ సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ పనులు తుది దశకు చేరుకున్నాయి. అత్యాధునిక వసతులు, ఆధునిక హంగులతో జిల్లా కేంద్రమైన కొత్తగూడెం – పాల్వంచ పట్టణాల మధ్యలో కేఎస్ఎం వద్ద 25 ఎకరాల విస్తీర్ణంలో సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని నిర్మిస్తోంది. 2019లో మంత్రి కేటీఆర్ ఈ పనులకు శంకుస్థాపన చేశారు. ఇప్పటికే 95 శాతం పనులు పూర్తయ్యాయని, మార్చి నెలాఖరు వరకు వంద శాతం పూర్తి చేస్తామని అధికారులు ప్రభుత్వానికి పంపించిన నివేదికలో పేర్కొన్నారు. ఆర్అండ్బీ శాఖ అధికారులు పనులు చేపిస్తున్నారు.
సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం సిద్ధమవుతోంది. 50కిపైగా విభాగాల కార్యాలయాలు ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ నెల చివరి నాటికి పనులన్నీ పూర్తవుతాయి. ప్రతి రోజూ విజిట్ చేస్తూ పనులను పర్యవేక్షిస్తున్నాం. జిల్లా పరిధిలో అన్ని మండలాలకు కలెక్టరేట్ ఎక్కడ ఉందనే విషయం స్పష్టంగా తెలుస్తుంది.
-దురిశెట్టి అనుదీప్, కలెక్టర్, భద్రాద్రి కొత్తగూడెం