హైదరాబాద్, మార్చి12 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే స్పోర్ట్స్, టూరిజం పాలసీలను ప్రకటిస్తుందని పర్యాటక, క్రీడలు, యుజవనశాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు. శనివారం ఆయన అసెంబ్లీలో టూరిజం, క్రీడాశాఖల బడ్జెట్ పద్దుపై మాట్లాడుతూ.. ఎకో సర్క్యూట్, ట్రైబల్ సర్క్యూట్, హైదరాబాద్ హెరిటేజ్ సర్క్యూట్తో కలిపి సమగ్ర పర్యాటక పాలసీని రూపొందిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలన్నింటినీ ప్రపంచస్థాయి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులను సైతం టూరిజం స్పాట్లుగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను పెంపొందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని శ్రీనివాస్గౌడ్ తెలిపారు. గ్రామీణస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు క్రీడాకారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. క్రీడారంగం అభివృద్ధికి ప్రతి జిల్లాలో మైదానాలను తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. నిరుద్యోగ యువతకు సెట్విన్ తదితర సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను జిల్లా స్థాయికి విస్తరింపజేస్తామని పేర్కొన్నారు.