ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో కలర్ ఫుల్ జోష్ కనిపించింది. శుక్రవారం ఉదయం నుంచే హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. చిన్నా పెద్దా తేడాలేకుండా వీధుల్లోకి వచ్చి ఒకరికొకరు రంగులు పూసుకున్నారు. డప్పు చప్పుళ్ల మధ్య కేరింతలు కొడుతూ నృత్యాలు చేశారు. పలుచోట్ల వివిధ శాఖల ఉద్యోగులు సిబ్బందితో కలిసి సందడి చేశారు. ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపేందుకు తరలివచ్చిన అధికారులు, నాయకులు, కార్యకర్తలతో వారి నివాసాలు కిక్కిరిశాయి.
– ఎదులాపురం/నిర్మల్ అర్బన్, మార్చి18
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో హోలీ పండుగను శుక్రవారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ తన కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. రంగులు చల్లుకుంటూ సరదాగా గడిపారు. ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి, అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తమ కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి జిల్లా పోలీసులతో కలిసి రంగులు చల్లుకుంటూ, ఆనందోత్సహాల్లో మునిగి తేలారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, మాజీ ఎంపీ జీ నగేశ్ కార్యకర్తలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. నిర్మల్ ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సీహెచ్ ప్రవీణ్కుమార్కు పోలీస్ సిబ్బంది రంగులు పూసి, పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భైంసాలో ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డికి పలువురు నాయకులు, కార్యకర్తలు కలిసి రంగులు పూశారు. ఆయా చోట్ల అధికారులు, ప్రజాప్రతినిధులు సందడి చేశారు.