లింగాల ఘణపురం : జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలం వనపర్తి గ్రామం ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులపై జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని కుందారం, వనపర్తి, నేల పోగుల గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ క్రమంలో వనపర్తి కొనుగోలు కేంద్రంలో ఏఈఓ శ్రీనివాస్ ఒక్కరే ఉండడం నిర్వాహకులు ఎవరు లేకపోవడం, హమాలీలు రాకపోవడం, ధాన్యం కొనుగోలు ప్రారంభం కాక పోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలాగైతే రైతుల నుండి సకాలంలో ధాన్యాన్ని ఎలా కొనుగోలు చేస్తాం? కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎన్ని రోజులు పడిగాపులు కాయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రాన్ని ఏర్పాటు చేసి వారం రోజులు గడుస్తున్న ఒక్క గింజ కొనకపోవడం ఏమిటని ప్రశ్నించారు. రైతులకు ఎలాంటి పరిస్థితుల్లో అసౌకర్యం కలగొద్దని కలెక్టర్ ఆదేశించారు. కాగా, వనపర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి వారం రోజులు గడుస్తున్నా కొనుగోలు ప్రారంభం కాలేదు. మిల్లర్ల కేటాయింపు జరగాక పోవడంతో పాటు హమాలీల కూలీ రేటు నిర్ణయం కాలేదు, మంగళవారం ఉదయమే కొనుగోలు ప్రారంభం కావలసి ఉండగా హమాలీల సమస్యతో నిలిచిపోయింది.