రంగారెడ్డి, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా ముసాయిదా ఓటరు జాబితాను సోమవారం కలెక్టర్ నారాయణరెడ్డి ప్రకటించారు. నియోజకవర్గాల వారీగా పోలింగ్ బూత్లు, ఓటర్ల వివరాలను తెలిపారు. జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 36, 62, 221 మంది ఉన్నారు. వీరిలో 18,83,270 మంది పురుషులు, 17,78,516 మంది స్త్రీలు ఉన్నారు. 433 మంది ట్రాన్జెండర్స్ ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 3,501పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
వికారాబాద్ జిల్లాలో..
వికారాబాద్, జనవరి 6 : ప్రత్యేక ఓటర్ నమోదు 2025లో భాగంగా ముసాయిదా ఓటరు జాబితాను వికారాబాద్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రతీక్ జైన్ విడుదల చేశారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలోని తన చాంబర్లో ఓటరు ముసాయిదా జాబితాపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో అదనపు కలెక్టర్ లింగ్యానాయక్తో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో ఓటరు నమోదు జాబితాలో మొత్తం 10 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యారన్నారు. 4 నియోజకవర్గాల్లో 1133 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. జిల్లాలో ముసాయిదా జాబితాలో 10,00,032 మంది ఓటర్లు ఉన్నారని ఇందులో 4,92,613 మంది పురుషులు, 5,07,644 మంది స్త్రీలు ఉండగా, 45 మంది ఇతర ఓటర్లు ఉన్నట్లు తెలిపారు.
పరిగి నియోజకవర్గంలో 2,71,060 మంది ఓటర్లకు గాను 1,35,522 మంది పురుషులు, 1,35,528 మంది స్త్రీలు, 10 మంది ఇతరులు ఉన్నారన్నారు. వికారాబాద్ నియోజకవర్గంలో 2,34,933 మంది ఓటర్లు నమోదు కాగా, 1,16,388 మంది పురుషులు, 1,18,524 మంది స్త్రీలు, 21 మంది ఇతర ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. తాండూరు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,47,783 ఉండగా, 1,19,824 మంది పురుషులు, 1,27,952 మంది స్త్రీలు, 7 గురు ఇతరులు ఉన్నట్లు గుర్తించారు. కొడంగల్ నియోజకవర్గంలో 2,46,526 మంది ఓటర్లలో 1,20,879 మంది పురుషులు, 1,25,640 మంది స్త్రీలు, ఏడుగురు ఇతరులు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 549 సర్వీస్ ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. పరిగిలో 247, వికారాబాద్ 79, తాండూరు 53, కొడంగల్లో 170 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారని కలెక్టర్ వివరించారు. సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో పాటు ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ నెహత్ అలీ, డిప్యూటీ తహసీల్దార్ డి.ఉష, సిబ్బంది పాల్గొన్నారు.