హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 8: హనుమకొండ జిల్లాలోని 12 మండలాల్లో గ్రామపంచాయతీల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాను ఇప్పటికే ప్రచురించామని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలో ముసాయిదా ఓటర్లు, పోలింగ్ కేంద్రాల జాబితాపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ ముసాయిదా ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే రాజకీయ పార్టీల ప్రతినిధులు తెలియజేయాలన్నారు.
సోమవారం 12 మండలాల్లో ఎంపీడీవోలు మండలస్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాపై అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. సమావేశానికి హాజరైన రాజకీయ పార్టీల ప్రతినిధులు మండలాల్లో ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటి సమాచారాన్ని అందజేయాలన్నారు. రాష్ర్ట ఎన్నికల సంఘం ఆదేశాలమేరకు రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి ముసాయిదా ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించి 9న సవరించిన అనంతరం 10న ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా తుది ఓటర్ల జాబితాను ప్రదర్శించడం జరుగుతుందన్నారు.
హనుమకొండ జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయని, 12 మండల ప్రజాపరిషత్, 12 జిల్లా ప్రజాపరిషత్లున్నాయని, జిల్లాలో 370871 మంది ఓటర్లు ఉండగా, ఇందులో మహిళా ఓటర్లు 190201 ఉండగా, పురుష ఓటర్లు 180666, ఇతరులు నలుగురు ఉన్నారని తెలిపారు. హనుమకొండ జిల్లాలో 631 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, జిల్లా పరిషత్ ఇన్ఛార్జి సీఈవో రవి సమాధానమిచ్చారు.