బెంగళూరు : దేశంలో బొగ్గు కొరతతో విద్యుత్ కోతలు పెరిగే అవకాశం ఉందన్న వార్తలపై కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధ రామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. థర్మల్ ప్లాంట్లను ప్రైవేటీకరించే లక్ష్యంతో బొగ్గు కృత్రిమ కొరతను కర్ణాటక ప్రభుత్వం సృష్టించిందని ఆరోపించారు. రాష్ట్రానికి తగినంత విద్యుత్ ఉత్పత్తి ఉందని, రిజర్వాయర్లు నీటితో నిండిపోయాయన్న ఆయన.. బొగ్గు కొరత సమస్య వాస్తవమేనా అని సందేహిస్తున్నట్లు పేర్కొన్నారు.
‘మేం ప్రైవేటీకరణకు వ్యతిరేకం. తగిన విద్యుత్ ఉత్పత్తి ఉంది. రిజర్వాయర్లు నిండి ఉన్నాయి. మనకు సౌరశక్తి ఉత్పత్తి ఉంది. రాష్ట్రంలో బొగ్గు కొరత లేదు. రాష్ట్ర ప్రభుత్వం కృతిమ కొరత సృష్టిస్తుందనే సందేహం నాకుంది’ అన్నారు. కర్ణాటక ప్రభుత్వం ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తోందని, అందుకే బొగ్గు కొరతను సృష్టిస్తున్నారని, కానీ తాము దానికి వ్యతిరేకమన్నారు. విద్యుత్ ప్లాంట్లలో బొగ్గు కొరత కారణంగా తమ రాష్ట్రాల్లో తలెత్తే విద్యుత్ సంక్షోభంపై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించారు. ఆ రాష్ట్రాల జాబితాలో ఢిల్లీ, బిహార్, ఏపీ, కర్ణాటక, పంజాబ్, ఛత్తీస్గఢ్ ఉన్నాయి.