నేను అధికారంలోకి వచ్చిన ఎనిమిదేండ్లలో దేశం తలవంచుకునే పని ఏదీ చేయలేదు.. ఇదీ.. ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్ పర్యటనలో గొప్పగా ప్రకటించుకున్న మాట! ఇప్పటికే దేశం ఒక దఫా విద్యుత్తు సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. తగిన సంసిద్ధత లేకపోవడం వల్లే ఆ పరిస్థితి తలెత్తిందని నిపుణులు మొత్తుకున్నారు! అయినా.. తీరు మారలేదు! ఫలితం.. మరోసారి పెను విద్యుత్తు సంక్షోభం దేశాన్ని చీకట్లతో నింపేయనున్నది! ఇది దేశం తల దించుకునే పని కాదా?
హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): బొగ్గు సంక్షోభం దేశాన్ని కుదిపేస్తున్నది. నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేతగానితనం దేశాన్ని అంధకారంలోకి నెట్టివేస్తున్నది. ఈ సంక్షోభం ఇప్పటితో ఆగిపోయేలా లేదు. వానకాలం ముగిసేవరకు పరిస్థితి ఇంతేనని, రోజురోజుకూ ఉత్పత్తి పడిపోవడం ఖాయమని నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే అనేక రాష్ర్టాల్లో రోజూ గంటలపాటు విద్యుత్తు కోతలు తప్పడం లేదు. రానురాను ఇవి మరింత పెరుగుతాయని అంటున్నారు. ఏటికేడాది పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్ను పరిగణనలోకి తీసుకొని, కరోనా తరువాత మరింతగా వచ్చే డిమాండ్ను, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలను అంచనా వేయడంలో కేంద్రం కనీస స్పృహ లేకుండా వ్యవహరించిందని నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవసరాలకు అనుగుణంగా విద్యుత్తు ఉత్పత్తిని పెంచడానికి ప్రణాళికను సిద్ధంచేసి అమలు చేయడంలోనూ కేంద్రం ఘోరంగా విఫలమైందని చెప్తున్నారు. అయితే ఇందుకు తెలంగాణ మాత్రం మినహాయింపు అని పేర్కొంటున్నారు.
రాష్ట్రంగా ఏర్పడే నాటికి తెలంగాణ అంధకారమయంగా ఉండేది. తొలుత విద్యుత్తు రంగంపైనే దృష్టిసారించిన సీఎం కేసీఆర్.. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్తును కొనుగోలు చేసి, ఆర్నెళ్లలోనే విద్యుత్తు కోతలకు చరమగీతం పాడారు. అక్కడితో ఆగకుండా రాష్ట్రం విద్యుత్తు వ్యవస్థలో స్వయం సమృద్ధి సాధించేలా ఉత్పత్తి, పంపిణీ, సరఫరా వ్యవస్థలను పటిష్టం చేశారు. ప్రత్యేకించి ఇటీవలి సంక్షోభం తెలంగాణపై ప్రభావం చూపకుండా ముందు జాగ్రత్త చర్యగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిని పెంచి, విద్యుదుత్పత్తి సంస్థలకు సరిపడా నిల్వలు అందించారు. ఫలితంగా.. దేశమంతా చీకట్లు అలముకున్నా.. తెలంగాణలో క్షణకాలమైనా కరెంటు పోలేదు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో తీసుకొన్న నిర్ణయాలు తెలంగాణలో అంధకారం అలమకుండా కాపాడుతున్నాయని చెప్తున్నారు.
బొగ్గు ఉత్పత్తి, సరఫరా అంచనాలు వేసే మొదటి అడుగులోనే కేంద్రం పూర్తిగా విఫలమైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 758 మిలియన్ టన్నుల బొగ్గు అవసరం అవుతుందని, ఇందులో సుమారు 17.7 మిలియన్ టన్నుల లోటు ఉంటుందని కేంద్రం అంచనా వేసింది. అయితే పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్, ఫిబ్రవరిలో మొదలైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలను నిశితంగా గమనించడంలో కేంద్రం విఫలమైంది. ఎండాకాలంలో కరెంటు వినియోగం ఒక్కసారిగా పెరుగడంతో డిమాండ్ పెరిగింది. దీంతో బొగ్గు అవసరం 784.6 మిలియన్ టన్నులకు పెరిగింది. అంచనాలకన్నా ఇది 3.3 శాతం అధికం. లోటు ఏకంగా 49.3 మిలియన్ టన్నులకు పెరిగింది. ముందస్తు అంచనాలకన్నా ఇది 280 శాతం అధికం. వచ్చే జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 197.3 మిలియన్ టన్నుల బొగ్గు అవసరమవుతుందని అంచనా. అయితే 154.7 టన్నుల దేశీయ బొగ్గు మాత్రమే సరఫరా అవుతుందని భావిస్తున్నారు. దీంతో లోటు 42.5 మిలియన్ టన్నులకు చేరుకోనున్నది.
కేంద్రం తన అసమర్థతను రాష్ర్టాలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నది. విద్యుత్తు సరఫరా సంస్థలు విదేశాల నుంచి బొగ్గును కచ్చితంగా దిగుమతి చేసుకోవాలని, లేదంటే దేశీయ బొగ్గు సరఫరాను సైతం నిలిపివేస్తామని హుకుం జారీ చేసింది. యుద్ధం నేపథ్యంలో అతర్జాతీయంగా బొగ్గు ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో ఒక్క రాష్ట్రం మినహా మిగతా రాష్ర్టాలేవీ ఇప్పటికీ బొగ్గును దిగుమతి చేసుకోలేదు. కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఈ అంశం చర్చకు రాగా.. రాష్ర్టాల ప్రతినిధులు తమ వల్ల కాదని చేతులెత్తేశారు. ప్రస్తుతం విదేశీ బొగ్గు దొరకడం కష్టంగా ఉన్నదని, అందుబాటులో ఉన్నా ధరలు విపరీతంగా పెరిగాయని విద్యుత్తు సంస్థల ఉన్నతాధికారులు చెప్పారు. రాష్ర్టాల విద్యుత్తు పంపిణీ సంస్థలకు అంత భారాన్ని మోసే ఆర్థిక శక్తి లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆయా సంస్థలు రూ.లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రమే ఆదుకోవాలని, కోల్ ఇండియా ద్వారా బొగ్గును సేకరించి, రాష్ర్టాలకు సరఫరా చేయాలని కోరారు. రాష్ర్టాలపై భారం పడకుండా రాయితీపై అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఇంత విద్యుత్తు సంక్షోభంలోనూ దేశంలో అన్ని రంగాలకు 24 గంటల నిరంతరాయ విద్యుత్తు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. సీఎం కేసీఆర్ ముందుచూపు ఫలితంగా రాష్ట్రంలో వెలుగులు ప్రసరిస్తున్నాయి. విద్యుత్తు డిమాండ్ను ముందే ఊహించి సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిని పెంచడం, విద్యుదుత్పత్తి సంస్థల దగ్గర సరిపడా నిల్వలు ఉంచడం ఇప్పుడు కలిసి వస్తున్నదని నిపుణులు చెప్తున్నారు. సమీప భవిష్యత్తులోనూ తెలంగాణలో విద్యుత్తు కోతలు పెద్దగా ఉండకపోవచ్చని అంటున్నారు.
ఓవైపు దేశీయ బొగ్గు సరఫరా తగ్గిపోవడం, మరోవైపు దిగుమతి చేసుకొనే పరిస్థితి లేకపోవడంతో విద్యుదుత్పత్తి సంస్థల వద్ద నిల్వలు నిండుకొంటున్నాయి. ఏప్రిల్తో పోల్చితే ఇప్పటికే నిల్వలు 13 శాతం పడిపోయాయని నివేదికలు చెప్తున్నాయి. ఇది గత 9 ఏండ్లలోనే రికార్డు స్థాయి లోటు. వెంటనే దిగుమతులు పెంచకపోతే జూలైతో నిల్వలన్నీ అయిపోతాయని అధికారులు చెప్తున్నారు. సాధారణంగానే వానకాలంలో బొగ్గు వెలికితీతకు అంతరాయం ఏర్పడి, ఉత్పత్తి తగ్గుతుంది. అదే సమయంలో విద్యుత్తు డిమాండ్లో మార్పు పెద్దగా ఉండదు. అంటే రానురాను బొగ్గులోటు పెరుగుతుందే తప్ప తగ్గదని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి శీతాకాలం ప్రారంభయ్యే వరకు విద్యుత్తు సంక్షోభం రోజురోజుకూ పెరుగుతుందని స్పష్టం చేస్తున్నారు.