బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు నిర్ణయం
బెస్ట్ స్కీం దరఖాస్తుల గడువు 20
60 ఏండ్ల పండితులకు 5వేల భృతి
హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): ఉద్యోగాల భర్తీ నేపథ్యంలో పోటీ పరీక్షలకు సిద్ధమ య్యే బ్రాహ్మణ అభ్యర్థులు కోచింగ్ తీసుకునేందుకు వీలుగా డబ్బు రూపేణా సహాయం చేయాలని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు నిర్ణయించింది. బుధవారం బొగ్గులకుంటలోని కార్యాలయంలో అధ్యక్షుడు డాక్టర్ కేవీ రమణాచారి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో సభ్యులు పలు నిర్ణయాలు తీసుకున్నారు. బెస్ట్ స్కీం దరఖాస్తుల గడువును ఏప్రిల్ 20 వరకు పొడిగించారు. ప్రస్తుతం 75 ఏండ్ల వృద్ధ పండితులకు ప్రతి నెల రూ.2,500 భృతిగా ఇస్తుండగా.. ఇకపై 60 ఏండ్లు నిండిన పండితులకు నెలకు రూ.5వేల భృతి ఇవ్వాలని నిర్ణయించారు. వేద పాఠశాలలకు ఏటా రూ.2 లక్షల గ్రాంట్, నాగోల్లోని కంచిమఠం సంప్రదాయ పాఠశాలకు రూ.10 లక్షల గ్రాంట్గా ఇవ్వాలని నిర్ణయించారు. సమావేశంలో బ్రాహ్మణ పరిషత్తు సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, సముద్రాల వేణుగోపాలచారి, ఎమ్మెల్సీ పురాణం సతీశ్, మృత్యుంజయశర్మ, వనం జ్వాలానర్సింహారావు, బోర్పట్ల హనుమంతచారి, సువర్ణ సులోచన, సుమలతశర్మ, అష్టకాల రామ్మోహన్, మరుమాముల వెంకటరమణ శర్మ, జోషి గోపాలశర్మ, భద్రకాళి శేషు, సభ్యకార్యదర్శి అనిల్కుమార్, పరిషత్తు పాలనాధికారి రఘురాంశర్మ పాల్గొన్నారు.