హనుమకొండ చౌరస్తా, జూలై 13 : రాష్ర్టంలో విద్యార్థుల సమస్యలు పరిస్కరించకుండా విద్యార్థులకు అన్యాయం చేయడాన్ని నిరసిస్తూ సుబేదారి ఆర్ట్స్కాలేజీ వద్ద ఏబీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మంద నరేష్ మాట్లాడుతూ.. విద్యార్థుల ఓట్లతో, వారి తల్లిదండ్రుల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి సీఎంగా రేవంత్రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు.
జిల్లాలో విచ్చలవిడిగా ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థి తల్లిదండ్రుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరమన్నారు. జిల్లాలో పర్మిషన్ లేని ప్రైవేట్ విద్యాసంస్థలను మూసివేయాలని అదేవిధంగా ప్రభుత్వ విద్యాసంస్థలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని నాణ్యమైన విద్యను, భోజనం అందించాలన్నారు.
ప్రభుత్వ హాస్టల్స్లో ఉంటున్న విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని వెంటనే ముఖ్యమంత్రి స్పందించి విద్యార్థులకు న్యాయం చేయకుంటే జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని మంద నరేష్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ధార సురేష్, జిల్లా నాయకులు పోతురాజు ఉదయ్,కిరణ్, చల్లా శ్రీకాంత్, కొమ్ము సతీష్, సాయి, కళ్యాణ్, వెంకటేష్, సురేష్ పాల్గొన్నారు.