హైదరాబాద్, మే 22(నమస్తే తెలంగాణ) : ‘80% ధాన్యం కొనుగోలు చేసినం. ఇంకా 20% కొంటే కొనుగోళ్లు పూర్తవుతాయి’ ఇవీ గురువారం ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పిన లెక్కలు. సీఎం చెప్పిన లెక్కలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు ఏమాత్రం పొంతనలేదు. క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాల్లో నేటికీ వడ్ల రాశులు గుట్టలను తలపిస్తున్నాయి. సవాలక్ష సమస్యలతో కొనుగోళ్లు ముందుకు సాగడంలేదు. సివిల్ సైప్లె శాఖ లెక్కల ప్రకారం నిర్దేశించుకున్న లక్ష్యంలో 50% కూడా కొనుగోలు చేయలేదు. ఈ సీజన్లో 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, గురువారం వరకు 44 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసినట్టు సమాచారం.
అంటే సర్కార్ నిర్దేశించుకున్న లక్ష్యంలో ఇది 48.88 శాతమే. ఇంకా 51.11% ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వాస్తవ లెక్కలు ఇలా ఉంటే, సీఎం రేవంత్రెడ్డి మాత్రం ఇంకో 20% కొనుగోలు చేస్తే సరిపోతుందని చెప్పడం గమనార్హం. పోనీ, సివిల్ సైప్లె శాఖ 75.68 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి వస్తుందని అంచనా వేసింది. ఈ లెక్కన చూసినా కొనుగోలు చేసింది 58% కాగా కొనుగోలు చేయాల్సింది ఇంకా 42% ఉంటుంది. ఇలా వాస్తవ లెక్కలను పక్కనపెట్టి సీఎం తప్పుడు లెక్కలు చెప్పడం ఏమిటనే విమర్శలొస్తున్నాయి. సీఎం చెప్పిన లెక్కలు రైతులను ఆందోళనకు గురి చేసేవిధంగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.