ముంబై: శివసేన రెబల్ ఎమ్మెల్యేలు తాజాగా ఓ లేఖను రిలీజ్ చేశారు. ఆ లేఖను ఏక్నాథ్ షిండే మీడియాతో షేర్ చేశారు. రాష్ట్రంలో శివసేన పార్టీకి చెందిన వ్యక్తే సీఎంగా ఉన్నా.. వర్షా బంగ్లాకు వెళ్లి ఆయన్ను కలిసేందుకు సొంత పార్టీ ఎమ్మెల్యేలకే అవకాశం దక్కలేదని ఆ లేఖలో ఫిర్యాదు చేశారు. సీఎం చుట్టూ ఉండే మనుషులే తాము సీఎంను కలవాలో వద్దో నిర్ణయించేవాళ్లు అని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం వ్యహరించిన తీరు అవమానకరంగా ఉందని రెబల్ ఎమ్మెల్యేలు ఆరోపించారు.
సీఎం ఉద్దవ్ ఎన్నడూ సెక్రటేరియేట్ రాలేదని, ఆయన ఎప్పుడూ స్వంత నివాసం మాత్రుశ్రీలోనే ఉండేవారని, సీఎం ఇంట్లో ఉండే అధికారులకు ఫోన్ చేసినా.. వాళ్లెప్పుడూ ఆ ఫోన్లకు సమాధానం ఇవ్వలేదని, వీటన్నింటితో విసిగిపోయామని, అందుకే షిండేను ఆశ్రయించినట్లు రెబల్ ఎమ్మెల్యేలు తెలిపారు. స్వంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సీఎంను కలవలేకపోయేవారని, కానీ ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు మాత్రం ఆయన్ను కలిసేవారని ఆరోపించారు. ఇక ఆ నేతలకు చెందిన నియోజకవర్గాలకు మాత్రమే నిధుల్ని రిలీజ్ చేసేవారని రెబల్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.
హిందుత్వ, రామ మందిరం మన పార్టీకి కీలకమైన అంశాలని, మరి అలాంటప్పుడు అయోధ్య వెళ్లకుండా తమ ఎమ్మెల్యేలను ఎందుకు అడ్డుకున్నారని రెబల్స్ ప్రశ్నించారు. ఆదిత్య థాకరే అయోధ్య వెళ్తున్న సమయంలో తమ పార్టీ ఎమ్మెల్యేలను ఎందుకు వెళ్లనివ్వలేదని రెబల్స్ తమ లేఖలో అడిగారు.