నిర్మల్, ఏప్రిల్ 6 : రాష్ట్రంలోని దళితులకు శాశ్వత ఉపాధి కల్పించి వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులు మార్చేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం నిర్మల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్మల్ నియోజకవర్గానికి చెందిన 100 మంది లబ్ధిదారులకు రూ.10 కోట్ల విలువైన దళితబంధు చెక్కులను పంపిణీ చేశారు. అంతకుముందు డా. బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రైతుబంధు పథకం ద్వారా రాష్ట్రంలో వ్యవసాయాన్ని రైతులను అభివృద్ధి పథంలో నడిపించిన విధంగానే, దళిత బంధు పథకం ద్వారా రాష్ట్రంలో దళిత సాధికారత కోసం సీఎం కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. పేదల బతుకుల్లో సమూల మార్పు కోసమే ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు.
నిర్మల్ నియోజకవర్గానికి 100 యూనిట్లు, ముధోల్ నియోజకవర్గానికి 100 యూనిట్లు, ఖానాపూర్ నియోజకవర్గానికి 61 యూనిట్లకు దళితబంధు పథకం అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. అందరూ ఒకే రకమైన వ్యాపారం కాకుండా, ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉన్న వాటిని ఎంచుకుని తాము ఉపాధి పొందడమే కాకుండా మరో నలుగురి ఉపాధి కల్పించేలా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ మురఫ్ అలీ ఫారూఖీ, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.