హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్) సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం సోదర సోదరీమణులంతా ఈద్ ఉల్ ఫితర్ పర్వదిన వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని, పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని ఆకాంక్షించారు. రంజాన్ మాసంలో క్రమం తప్పకుండా ఆచరించే ఉపవాసం, దైవ ప్రార్థనలు.. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని, ఆధ్యాత్మికతను పెంపొందిస్తాయని తెలిపారు. మానవ సేవ చేయాలనే సందేశాన్ని రంజాన్ పండుగ సమస్త మానవాళికి అందిస్తుందని సీఎం గుర్తుచేశారు. గంగా జమునా తెహజీబ్కు తెలంగాణ ప్రతీక అని, లౌకికవాదం, మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ, దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ముస్లిం మైనార్టీల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని, వారి సంక్షేమానికి ప్రతి ఏటా భారీగా నిధులు కేటాయించి ఎన్నో కార్యక్రమాలు అమలుచేస్తున్నదని చెప్పారు.
షాదీ ముబారక్ పథకం ద్వారా ఆడపిల్లల పెండ్లి ఖర్చుల కోసం 1 లక్ష 116 రూపాయల సాయం అందించి, ముస్లిం పేదింటి ఆడపిల్లల కుటుంబాలకు చేయూతనందిస్తున్నదని పేర్కొన్నారు. మైనార్టీ యువతకు ప్రత్యేక శిక్షణనిచ్చి స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నదన్నారు. గురుకులాల ద్వారా మైనార్టీ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు. ఉన్న విద్యను అభ్యసించడానికి విదేశాలకు వెళ్లే ముస్లిం విద్యార్థులకు ఓవర్సీస్ సాలర్షిప్స్ ద్వారా 20 లక్షల రూపాయల ఆర్థికసహాయం అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మతసామరస్యాన్ని కాపాడటానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంటుందని.. లౌకికవాద విఘాత శక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు.
బసవేశ్వర జయంతి శుభాకాంక్షలు
బసవేశ్వరుని జయంతి సందర్భంగా.. వీర శైవ లింగాయత్, లింగ బలిజలకు ముఖ్యమంత్రి కే చం ద్రశేఖర్రావు శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలో వర్ణ, కుల, లింగ వివక్షను రూపుమాపడానికి అహర్నిశలూ కృషి చేసిన అభ్యుదయవాది బసవేశ్వరుడని సీఎం కేసీఆర్ కొనియాడారు. సాహితీవేత్తగా, ఆ నాటి పాలనా వ్యవస్థలో భాగస్వామిగా, సమానత్వం కోసం, ప్రజాసంక్షేమం కోసం పోరాడిన బసవేశ్వరుని సిద్ధాంతం, కార్యాచరణ గొప్పదని పేర్కొన్నారు. భారత మత, సామాజిక చరిత్రలో బసవేశ్వరుని సిద్ధాంతం విప్లవాత్మకమైనదిగా నిలిచిందని గుర్తుచేశారు. మానవీయమైన బసవేశ్వరుని ఆశయాలు నేటికీ ఆచరణీయమని తెలిపారు.