హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బతికించారని, తెలంగాణ లాంటి పరిస్థితి వేరే రాష్ట్రంలో ఉంటే ఎప్పుడో మూతపడేసేవారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ప్రతి నెల ఒకటో తేదీన కార్మికులకు వేతనాలు అందిస్తున్నట్టు తెలిపారు. కేంద్రప్రభుత్వ తీరుతో ఆర్టీసీకి డీజిల్ ధరలు శరాఘాతంగా మారాయని, సంస్థపై రోజూ రూ.1.8 కోట్ల అదనపు భారం పడుతున్నదని విమర్శించారు. శుక్రవారం శాసనసభలో రవాణాశాఖ పద్దుపై మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర తాజా బడ్జెట్లో ఆర్టీసీకి రూ.1,500 కోట్లు కేటాయించినందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ ఆదాయం పెరుగుతున్నదని, కార్మికులకు రూ. 531 కోట్ల సీసీఎస్ రుణాలు, రూ.312 కోట్ల పీఎఫ్ బకాయిలను తీర్చినట్టు చెప్పారు. తార్నాక దవాఖానలో 20 ఐసీయూ పడకల ఏర్పాటుతోపాటు నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఆర్టీసీ కార్గో సేవల ద్వారా ఈ ఏడాది రూ.60 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. ఏసీ బస్సుల నిర్వహణపై కేంద్రం సబ్సిడీ ఎత్తేయడంతో అవి ఆర్టీసీకి భారంగా మారాయని, అందువల్లనే వాటి విషయంలో వెనక్కి తగ్గినట్టు చెప్పారు. కొత్తగా ఆర్టీసీ భూములను లీజుకు ఇవ్వడం లేదని, గతంలో ఇచ్చిన వాటికి సమయానుగుణంగా అద్దెను వసూలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. స్కూల్ పిల్లలకు సంబంధించి బస్సులను నిలిపివేశామనేది అబద్ధమని, అవసరమైతే విద్యార్థుల కోసం మరిన్ని బస్సులను నడిపిస్తామని స్పష్టంచేశారు. ఎలక్ట్రిక్ పాలసీ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలకు పన్ను రాయితీ ఇస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు 16 వేలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్ట్రేషన్ అయినట్టు వివరించారు. ఫ్యాన్సీ నంబర్ల ద్వారా రూ.73.24 కోట్ల ఆదాయం లభించిందని వెల్లడించారు.