హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ చట్టాల విషయంలో ప్రధాని మోదీ వెనుకంజ వేయడంలో ఉత్తరాది రైతుల పోరాటం ఎంత కీలక పాత్ర పోషించిందో.. ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరిక కూడా అంతే తీవ్రస్థాయిలో పనిచేసింది. తెలంగాణ ప్రభుత్వం రైతులకోసం ధర్నా నిర్వహించడం, స్వయంగా కేసీఆర్ అందులో పాల్గొనడం, చట్టాల రద్దుకు దేశవ్యాప్త ఉద్యమానికి నాయకత్వం వహిస్తానని ప్రకటించడం బీజేపీ అగ్రనేతలకు హెచ్చరిక సంకేతాలు పంపించాయి. కేసీఆర్ ప్రకటనతో రైతు ఉద్యమం మరింత విస్తరించే అవకాశం ఉన్నదని కేంద్రం భయపడింది. సీఎం ధర్నా వెనువెంటనే మోదీ ప్రకటన రావడం యాదృచ్ఛికం కాదు. ఉద్యమ సమయంలో కేసీఆర్ దేశవ్యాప్తంగా అన్ని పార్టీల నేతలను ఎలా కూడగట్టిందీ బీజేపీ అగ్రనేతలకు బాగా తెలుసు.
తెలంగాణలో వ్యవసాయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన నేతగా జాతీయ అధికార వర్గాల్లో పలుకుబడి ఉన్నది. హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని కేసీఆర్ ప్రకటించడంతో మోదీ, షా ద్వయం ఉలికిపడింది. రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో ఏ రోజుకారోజు పీఐబీ, కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్రానికి సమాచారం ఇస్తుంటాయి. గురువారం నాటి ధర్నాకు పెద్దసంఖ్యలో జనం రావడం, కేసీఆర్ భవిష్యత్తు కార్యాచరణను విస్పష్టంగా ప్రకటించడంతో ఇంకా మొండికేస్తే పరిస్థితి చేయి దాటిపోతుందని కేంద్రం భావించింది. ‘కేసీఆర్ హమ్సేభీ చాలూ హై’ అని గతంలో తనను కలిసిన ఒక పత్రికాధిపతితో అమిత్షా స్వయంగా వ్యాఖ్యానించడం, ఆయన రాజకీయ ఎత్తుగడల పట్ల వారికున్న భయానికి నిదర్శనం.
వ్యవసాయ చట్టాలను రద్దు చేయనున్నట్టు ప్రధాని మోదీ చేసిన ప్రకటనకు సరిగ్గా 21 గంటల ముందు ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో మాట్లాడిన సీఎం కేసీఆర్ ‘ఇక్కడ మనం చేస్తున్న ధర్నా సమాచారం ప్రధాని మోదీ టేబుల్ మీదికి ఐదు నిమిషాల్లో చేరుతుందని తెలుసు. ఈ సమాచారాన్ని ఇవ్వడానికి సీఐడీ వాళ్లు కూడా ఇక్కడ ఉంటారని కూడా నాకు తెలుసు. ఈ వేదిక నుంచే కేంద్రాన్ని హెచ్చరిస్తున్న. రైతుల కోసం మనం చేపట్టిన ఉద్యమం తెలంగాణకే పరిమితం కాదు. ఇక కేంద్రంపై యుద్ధమే. మున్ముందు దేశవ్యాప్తంగా రైతులందరినీ ఏకం చేసి, జాతీయస్థాయికి తీసుకెళ్లి, ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం’ అని తీవ్రంగా హెచ్చరించారు. కేసీఆర్ హెచ్చరిక కేంద్రానికి బలంగానే తాకింది. దక్షిణాది నుంచి, ముఖ్యంగా తెలంగాణ నుంచి తీవ్రస్థాయిలో ప్రకటన రావడంతో ఉలిక్కిపడింది. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని స్వయంగా ప్రకటించారు.
కేసీఆర్ రాజకీయ ఎత్తుగడల పట్ల బీజేపీ అగ్రనేతలకు పూర్తి అవగాహన ఉన్నది. కేసీఆర్ దక్షిణాది నుంచి జాతీయ స్థాయిలో గుర్తింపు, పలుకుబడి కలిగిన బలమైన ఏకైక నేత. వ్యూహ, ప్రతివూహాలు పన్నడంలో దిట్ట. ఆయనే స్వయంగా రంగంలోకి దిగితే ఈ ఆందోళన దక్షిణాదిలో కూడా రగుల్కొనే ప్రమాదం ఉన్నదని కేంద్రం పసిగట్టింది. కేసీఆర్ ఏదైనా అంశాన్ని భుజానికి ఎత్తుకున్నారంటే, గమ్యాన్ని ముద్దాడే వరకు వదిలిపెట్టరని బీజేపీ అగ్రనాయకత్వానికి తెలుసు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన తీరే తార్కాణం. అదీకాక తానే స్వయంగా రైతు. ఆయనకు వ్యవసాయ చట్టాలపై పూర్తి అవగాహన ఉన్నది.
బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో రెండుసార్లు అధికారంలోకి రావడంలో యూపీ సహా ఉత్తరాది రాష్ర్టాలదే కీలకపాత్ర. వ్యవసాయ చట్టాలతో దేశవ్యాప్తంగా బీజేపీపై తీవ్రమైన వ్యతిరేకత పెరిగింది. త్వరలో జరిగే 5 రాష్ర్టాల ఎన్నికల్లో వ్యతిరేక ఫలితం వస్తుందని నిఘావర్గాలు అంచనా వేశాయి. దీంతో సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణాది రాష్ర్టాలపైనే బీజేపీ ఆశలు పెట్టుకున్నది. ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ రైతుల ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లి ఉద్ధృతం చేస్తామని హెచ్చరించడంతో మోదీ పునరాలోచించేలా చేసిందని నిస్సందేహంగా చెప్పవచ్చు.
నెల రోజుల్లోనే బీజేపీ రెండుసార్లు యూటర్న్ తీసుకొన్నది. పెట్రోల్, డీజిల్ ధరలను నామమాత్రంగా తగ్గించి చేతులు దులుపుకొన్నది. ఇప్పుడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించింది.
దేశ రాజధాని శివార్లలో ఆందోళనకు దిగిన రైతులకు మద్దతుగా ధర్నాల్లో కూర్చున్నది ఇద్దరే ఇద్దరు సీఎంలు! ఒకరు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. మరొకరు అప్పటి పంజాబ్ సీఎం అమరిందర్సింగ్!
రైతు సల్లంగుండాలె, రాష్ట్రం సుభిక్షంగుండాలన్నదే ఆయన అభిమతం. అలాంటిది అన్నదాతకు నష్టం చేస్తామంటే కిమ్మనకుండా ఉంటారా? అందుకే తానే రంగంలోకి దిగారు.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు. ఉద్యమ ఉగ్గు పాలు తాగిన ఆయన.. ముఖ్యమంత్రి హోదాలో దేశరైతాంగం కోసం పోరాటానికి జై కొట్టారు. రైతు కోసం రోడ్డెక్కి ధర్నా చేసిన ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు. గురువారం ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో రైతన్న గొంతుకై.. కేంద్రంపై నిప్పుల వర్షం కురిపించారు.
పంజాబ్ రాజకీయాలను రైతులు శాసిస్తారని ప్రతీతి. కేంద్రం తెచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తమకు తాము ఉద్యమ పంథాను రూపొందించుకొని, రోడ్లెక్కి తమకు అండగా నిలవాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతుల డిమాండ్తో అప్పటి కాంగ్రెస్ సీఎం అమరీందర్సింగ్ రైతుల ఉద్యమానికి సంఘీభావం ప్రకటించి సెప్టెంబర్ 28, 2020న ధర్నాలో పాల్గొన్నారు.