ఘనంగా రామానుజ సహస్రాబ్ది
భగవద్రామానుజుల వారి సహస్రాబ్దిని పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో ఏర్పాటుచేసిన రామానుజుల విగ్రహావిష్కరణ, సహస్రకుండ లక్ష్మీనారాయణ యాగ ఏర్పాట్లను సీఎం కేసీఆర్ పరిశీలించారు. ఆదివారం దివ్యసాకేతానికి వెళ్లిన కేసీఆర్.. చినజీయర్ స్వామితో కలిసి యాగ ఏర్పాట్లపై చర్చించారు. మార్చిలో తలపెట్టిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃప్రారంభం, మహాసుదర్శన యాగంపైనా జీయర్స్వామితో చర్చించారు.
హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ)/శంషాబాద్: రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని దివ్యసాకేత ఆశ్రమంలో త్రిదండి చినజీయర్స్వామి నిర్వహించనున్న సహస్రకుండ లక్ష్మీనారాయణ యాగానికి సకల సదుపాయాలు కల్పించాలని అధికారులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశించారు. వచ్చే నెల 2 నుంచి 14వ తేదీవరకు ఆశ్రమంలో శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలతోపాటు యాగం నిర్వహించనున్నారు. ఆదివారం దివ్యసాకేతానికి వెళ్లిన సీఎం కేసీఆర్, చినజీయర్తో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃప్రారంభోత్సవంతోపాటు లక్ష్మీనారాయణ యాగం ఏర్పాట్లపై చర్చలు జరిపారు.
సీఎంకు రుత్విక్కులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఫిబ్రవరిలో రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ ఏర్పాట్లపై సమాలోచనలు చేశారు. మార్చి 28న యాదాద్రిలో మహా కుంభ సంప్రోక్షణం, 21 నుంచి మహా సుదర్శనయాగం నిర్వహించాలని ఇదివరకే నిర్ణయించి ముహూర్తాలు ఖరారుచేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాలకు ఆహ్వానాలు, ఏర్పాట్లు, సంబంధిత అంశాలపై చినజీయర్తో సీఎం చర్చించారు.
విస్తృత ఏర్పాట్లు
రామానుజ విగ్రహావిష్కరణ, సహస్రకుండ లక్ష్మీనారాయణ యాగానికి చేయాల్సిన ఏర్పాట్లను సీఎం సమీక్షించారు. జీయర్స్వామి యాగశాలకు సీఎంను తీసుకెళ్లి చూపించారు. 1,035 హోమ గుండాలతో ప్రత్యేక యా గం చేస్తారని తెలిపారు. ఈ యాగం కోసం రెండు లక్షల కిలోల ఆవునెయ్యితోపాటు ఇతర హోమ ద్రవ్యాలు వినియోగించనున్నట్టు వివరించారు. రామానుజ సహస్రాబ్ది సంరంభం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నదని చెప్పారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో యాగానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను సీఎం ఆదేశించారు. యాగానికి నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేయాలని ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డికి ఫోన్లో ఆదేశాలిచ్చారు.
మిషన్ భగీరథ నీళ్లు అందించాలని అధికారులకు సూచించారు. యాగం నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించాలని ఆదేశించారు. యాగ సమయంలో ఫైర్ ఇంజిన్లను సిద్ధంగా ఉంచాలని అగ్నిమాపకశాఖను ఆదేశించారు. యాగానికి వీవీఐపీలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున మెరుగైన సేవలు అందించేందుకు రోడ్లు బాగుచేయాలని, వీధిలైట్లు, రక్షణ ఏర్పాట్లు చేయాలని సూచించారు. యాగానికి వచ్చే ముఖ్యులకు స్వా గతం పలికేందుకు, వసతులు కల్పించడానికి ప్రత్యేకంగా అధికారులను నియమించాలని సీఎస్కు చెప్పినట్టు తెలిసింది. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా విగ్రహావిష్కరణ కార్యక్రమం నిలువబోతున్నదని, దీనికి ప్రభుత్వం తరఫున అవసరమైన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. సీఎం వెంట మంత్రులు హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి, ఎంపీ సంతోష్కుమార్, మై హోం గ్రూప్ సంస్థల అధినేత జూపల్లి రామేశ్వరరావు తదితరులు ఉన్నారు.