హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎత్తి చూపితే దేశ్రదోహులని ముద్ర వేస్తున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మీరు చెప్పింది వింటే మంచోళ్లు.. వాళ్లే దేశభక్తులు.. మీరు చేసే తప్పులను ఎత్తిచూపితే, మీ ప్రజావ్యతిరేక విధానాలను విమర్శిస్తే దేశద్రోహులా? అంటూ నిప్పులు చెరిగారు. తెల్లారె వరకే కేసీఆర్ దేశద్రోహి అయిపోయిండా? అని ప్రశ్నించారు.
‘నాది అటాకింగ్ కాదు.. డిమాండ్.. హిందుస్థాన్ జాగ కాపాడమని అడిగితే నన్ను దేశద్రోహి అంటరు. హిందూస్థాన్ భూమి ఇంకో దేశానికి పోవొద్దని చెప్పిన.. ఇవాళ కూడా అదే చెబుతా.. భవిష్యత్తులో కూడా చెబుతా.. అది దేశద్రోహం ఎట్ల అయితది? దేశద్రోహులు ఎవరు? భూమి వదిలేసేవారా లేక భూమి కాపాడేవాళ్లా?’ అని నిలదీశారు. దేశద్రోహి అని స్టాంప్ వేయటం, వినకపోతే వారం పదిరోజులు ఇన్కం ట్యాక్స్ రైడ్స్కు ఎగబెట్టడమే బీజేపీ స్టయిల్గా కొనసాగుతున్నదని విరుచుకుపడ్డారు. హక్కుల కోసం, సమస్యల పరిష్కారం కోసం గట్టిగా నిలదీసేవారిపై బీజేపీ మొదటి నుంచీ అయితే దేశద్రోహి లేదంటే అర్బన్ నక్సలైట్ అని ముద్ర వేస్తున్నది.
రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిచ్చినప్పడు టీఆర్ఎస్ పార్టీ దేశద్రోహి కాదు.. వివిధ బిల్లులకు సపోర్ట్ కోరినప్పుడు కేసీఆర్ దేశ ద్రోహి కాదు.. ఇప్పుడు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నా కాబట్టి దేశద్రోహి అయ్యాడా? ఎవరు ప్రజల పక్షాన ప్రశ్నిస్తే వారు దేశద్రోహులేనా? బీజేపీ ఏమైనా దేశ ద్రోహులను తయారు చేసే ఫ్యాక్టరీయా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను బీజేపీ నేతలే విమర్శిస్తున్నారని కేసీఆర్ అన్నారు. బీజేపీ నియమించిన మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్, కేంద్రం తెచ్చిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడిన విషయాన్ని గుర్తుచేశారు.
బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కూడా ఉద్యమం చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపారని చెప్పారు. వీరు కూడా దేశద్రోహులేనా? అని ప్రశ్నించారు. ‘కేసీఆర్ చైనాలో డబ్బు దాచుకున్నాడని అంటున్నారు. ఎవరైనా పోయిపోయి చైనాలో డబ్బు దాచుకుంటరా?’ అని ఎద్దేవాచేశారు. దేశంలో ఏమూలనైనా ప్రజలు బాగుండాలని కోరుకుంటామని, బీజేపీ మాదిరిగా సంకుచితంగా ఆలోచించబోమని స్పష్టంచేశారు. ‘మిస్టర్ బండి సంజయ్.. ఒళ్లు దగ్గరపెట్టుకో.. పిట్ట బెదిరింపులకు భయపడేవాడెవడూ లేడు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని హెచ్చరించారు.
సెస్ తగ్గిస్తరా.. లేదా..?
అబద్దాలు చెప్పి పెట్రోల్, డీజిల్పై విధించిన సెస్ను తగ్గిస్తరా? లేదా? బీజేపీ నేతలు సూటిగా సమాధానం చెప్పాలని కేసీఆర్ నిలదీశారు. సెస్ తగ్గిస్తే 77కే పెట్రోల్, 67కే డీజిల్ వస్తుందని వివరించారు. బీజేపీ సర్కారు 16 సార్లు పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పెట్రోల్ ధరలు తగ్గాలని కోరుకునేవాళ్లు పాకిస్తాన్ పోవాలె అంటారా? అని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశ ప్రగతిలో తెలంగాణ కీలకభూమిక పోషిస్తున్నమని, దేశ ఖజానా బీజేపీ అయ్య సొత్తు కాదని నిప్పులు చెరిగారు.
నీటిని సద్వినియోగం చేసుకొనే సామర్థ్యాలు లేవు
కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా.. రాజకీయాలు అవసరమైనప్పుడు కృష్ణా, గోదావరి, కావేరి నదుల అనుసంధానం పేరిట డ్రామాలు చేస్తరని మండిపడ్డారు. దేశంలో 65 వేల నుంచి 70వేల టీఎంసీల నీళ్లు ఉంటే 40వేల టీఎంసీలు సముద్రం పాలవుతున్నాయని, బీజేపీ నాయకులు సన్నాసుల్లా చూస్తూ కూర్చున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ర్టాల మధ్య నీటియుద్ధాలు జరుగుతున్నా కేంద్రం ప్రేక్షకపాత్ర వహిస్తున్నదని మండిపడ్డారు. ‘దేశానికి మంచినీళ్లు దిక్కులేవు.. సాగునీళ్లు దిక్కులేవు. ట్రిబ్యునల్కు రిఫర్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఏడేండ్ల సమయం సరిపోదా?.. అంటే తెలంగాణకు నీళ్లు వద్దా? ఢిల్లీకి పోయినప్పుడల్లా దరఖాస్తు ఇచ్చి వస్తున్నం. అయినా మేం ద్రోహం చేసినం అని సిగ్గులేకుండా మాట్లాడుతున్నవ్ ద్రోహం చేసింది నువ్వా? నేనా?’ అంటూ బండి సంజయ్ మీద సీఎం ఫైర్ అయ్యారు.
వాటిని ఎందుకు ప్రైవేటుపరం చేస్తున్నారు
నష్టంలో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను బంద్ చేస్తున్నమంటే ఆర్థం చేసుకోగలుగుతామని, కానీ లాభాలు వస్తున్న ఎల్ఐసీ లాంటి సంస్థలను ఎందుకు ప్రైవేట్పరం చేస్తున్నారని కేసీఆర్ ప్రశ్నించారు. ఎల్ఐసీ లాంటి సంస్థలు ప్రభుత్వానికి డివిడెండ్ కూడా ఇస్తున్నాయని గుర్తుచేశారు. ప్రభుత్వరంగంలో ఉంటే రిజర్వేషన్లు వస్తయి, పది మందికి అవకాశం దొరుకతదని చెప్పారు.
క్రాప్ కాలనీలుగా విభజించాలని చెప్పిన
ఈ దేశాన్ని మొత్తం క్రాప్ కాలనీ కింద విభజించాలని, డిమాండ్ ఉండే పంటలే పండించాలని సూచించానని కేసీఆర్ తెలిపారు. అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న పంటలను పండించే విజ్ఞానం రైతులకు ఇవ్వాలని, దీనిద్వారా వ్యవసాయ రంగం మంచిగా ఉంటదని ప్రధానికి,నీతి ఆయోగ్కు చెప్పానన్నారు. నూతన వ్యవసాయ చట్టాలను బండి సంజయ్ చదువుకున్నాడా? అంటూ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో సంవత్సర కాలంగా నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు నిరంతరంగా సమ్మె చేస్తున్నారని, సుమారు 600కు పైగా రైతులు ప్రాణాలు విడిచారని చెప్పారు. అయినా కేంద్రం తన మొండి వైఖరి వీడలేదని విమర్శించారు. ఫసల్ బీమా యోజనకు దిక్కేలేదని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి రాష్ట్రంలోనే ఆ పథకానికి దిక్కులేదని, కావాలంటే గుజరాత్ పోయి చూద్దామని సవాల్ విసిరారు.
చైనా ఎక్కడ..మనం ఎక్కడ
చైనా జీడీపీ 1980 వరకు మన దేశం కన్నా చాలా తక్కువగా ఉండేదని సీఎం తెలిపారు. అక్కడ వ్యవసాయ భూమి మన కన్నా తక్కువేనని చెప్పారు. కానీ నేడు చైనా ఎక్కడ, మనం ఎక్కడ ఉన్నామని ప్రశ్నించారు. ఇందుకు కారణం దేశంలో అవలంబిస్తున్న తప్పుడు విధానాలేనని పునరుద్ఘాటించారు. మన దేశంలో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలున్నాయని కానీ మన దేశానికి వచ్చే పర్యాటకులెంత మంది అని ప్రశ్నించారు. చిన్న గుట్కలా ఉండే సింగపూర్ను చూసి తలదించుకోవాలన్నారు. ‘అక్కడ ప్రతి సంవత్సరం ప్రతి పౌరునికి తలా కొన్ని డాలర్ల చొప్పున పంచిపెడుతరు’ అని వివరించారు. మన దేశ యువత దయచేసి ఇది ఆలోచించాలని విజ్ఞప్తిచేశారు. సింగపూర్కు 190 కి.మీ. సముద్రతీరం మాత్రమే ఉంటే వాళ్లు ఐదున్నర కోట్ల కంటైనర్లను ట్యాకిల్ చేస్తారని, కానీ మన దేశానికి 7500 కి.మీ. సముద్ర తీరం ఉన్నా.. మనం హ్యాండిల్ చేస్తున్న కంటైనర్లు లక్షల్లోనేనని తెలిపారు. దేశ యువతలో ఆశాంతి నెలకొందని కేసీఆర్ చెప్పారు. చైనాలో లింగ, కుల, మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు పనిచేస్తుంటారని తెలిపారు. ఆ పరిస్థితి మన దేశంలో రావాలని కోరుకుంటే తప్పా? అని ప్రశ్నించారు. తిరుపతిలో జరిగే దక్షిణాది రాష్ర్టాల సమావేశాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకరు హాజరవుతారని, తాను వెళ్లేదీ లేనిదీ భిన్నమైన అంశమన్నారు.
ప్రజాస్వామ్యాన్ని కూలదోసి అధికారం
టీఆర్ఎస్ రెండుసార్లు ఎలక్షన్ల గెలిచి వచ్చిన పార్టీ అని కేసీఆర్ తేల్చిచెప్పారు. కర్ణాటక, మధ్యప్రదేశ్లో ప్రజలు అధికారమివ్వకపోయినా దొడ్డిదారిలో ఆ రాష్ర్టాల్లో బీజేపీ గవర్నమెంట్ను నడిపిస్తున్నారని విమర్శించారు. అప్రజాస్వామికంగా ప్రభుత్వాలను కూలదోయటాన్ని ప్రశ్నిస్తే తప్పా? అని నిలదీశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 107 సీట్లలో బీజేపీకి డిపాజిట్ రాలేదని గుర్తుచేశారు.
జోక్ ఆఫ్ ది మిలీనియం
బీజేపీ నేతలు పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని, మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. గొర్ల పంపిణీ పథకం కేంద్రానిదే అయితే.. బీజేపీ పాలిత రాష్ర్టాలైన కర్నాటక, మధ్యప్రదేశ్లో ఎందుకు లేదని నిలదీశారు. తెలంగాణకు టీఆర్ఎస్ ఏమీ చేయలేదనడం జోక్ ఆఫ్ది మిలీనియమని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం తెలంగాణను తాము తీర్చిదిద్దిన తీరును చూసి కేంద్ర మంత్రులే ప్రశంసిస్తున్నారని, ఇంటింటికీ నల్లా నీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని స్వయంగా కేంద్ర మంత్రి ప్రశంసించారని, అయినా తాము ఏనాడూ డబ్బా కొట్టుకోలేదని వివరించారు. ఆర్థిక, వ్యవసాయ రంగాల్లో, ఉద్యోగ, మౌలిక సదుపాయాల కల్పనలో తెలంగాణ సాధించిన పురోగతిని ఏ ఒక్క బీజేపీ పాలిత రా్రష్ట్రమైనా సాధించిందా అని ప్రశ్నించారు. కరోనా సమయంలో దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రైవేట్ టీచర్లను ఆదుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. వలసకూలీలను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నామని, 165 రైళ్లను పెట్టి, ఆర్థిక సాయం అందజేసి వారి స్వంత స్థలాలను పంపితే, కూలీలందరూ తెలంగాణ జిందాబాద్ అంటూ జేజేలు పలుకుతూ వెళ్లారని వివరించారు. అదే బీజేపీ పాలిత రాష్ర్టాలైన కర్ణాటకలో ప్రైవేట్ టీచర్లను లాఠీచార్జి చేసి తరిమేశారని, వలసకూలీలను వారి మానాన వారిని వదిలేశారని విమర్శించారు.
ఈ దేశం సంస్కరించబడాలె
ఈ దేశం సంస్కరించబడవలసిన అవసరం ఉన్నది. దేశ ప్రజలు, యువకుల భవిష్యత్తు కోసం కొత్త పుంతలు తొక్కాలి. నూతన ఆర్థిక విధానాలు రావాల్సిన అవసరమున్నది. ఇతర దేశాల నుంచి నేర్చుకోవాలి. షాంఘై, బీజింగ్ ఇలా ఒక్కో సిటీలో ఆరువందల నుంచి ఎనిమిది వందల మీటర్ల అండర్గ్రౌండ్స్ ఉన్నాయి. బుల్లెట్ రైళ్లు, శాటిలైట్.. అంతరిక్ష పరిశోధనల్లో వారు ఉన్నారు. మనం ఇంకా దళితబంధు దగ్గరే ఉన్నాం. మత విద్వేషాలు రగిలిస్తం.. మా ఎంజెండాయే మతం అని చెప్తే.. దేశం ఎలా బాగుపడుతుంది? మతాన్ని ఎవరూ వద్దనడం లేదు. ఎవరికి ఇష్టమున్న మతం వాళ్లు స్వీకరిస్తారు. మేము గుడులు, గోపురాలు కడతలేమా? గుండు గీసుకుంటలేమా? సత్యనారాయణ కథలు చెప్పుకుంటలేమా? తిరుపతి పోమా? సరిహద్దుల మీద రెచ్చగొట్టాలె.. లేదంటే మతం పేరుమీద రెచ్చగొట్టాలె. భావోద్వేగాలు రెచ్చగొట్టాలె. రాజకీయ పబ్బం గడుపుకోవాలె.. ఇదే బీజేపీ ఎజెండాగా సాగుతున్నది. పక్కనున్న నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ కంటే మన జీడీపీ తక్కువ ఉంటదా?